ఆధ్యాత్మిక మార్గంలో సమంత... విడాకుల వార్తలపై రిపోర్టర్ ప్రశ్నకు బుద్ధి ఉందా అంటూ చిందులు
సమంత-చైతూల బంధం బీటలు వారింది. విడాకులు తీసుకొని విడిపోవడం ఇక అధికారికమే, సమంత, చైతు కొత్త ప్రవర్తన వెనుక ఆంతర్యం ఇదే... అంటూ దాదాపు నెల రోజులుగా వరుస కథనాలు వెలువడుతున్నాయి.
జాతీయ మీడియా సైతం ఈ విషయంపై ఫోకస్ పెట్టగా, అటు సమంత కానీ, ఇటు నాగ చైతన్య కానీ పెదవి విప్పడం లేదు. అయితే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనేది స్పష్టం అవుతుంది. సమంత ఖచ్చితంగా మానసిక వేదన అనుభవిస్తూ ఉండగా, దాని నుండి బయట పడేందుకు అనేక మార్గాలు ఎంచుకుంటుంది.
కొద్దిరోజుల క్రితం సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సమంత, ఫ్రెండ్స్ తో కలిసి గోవా టూర్ కి వెళ్లి వచ్చారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన పెట్ డాగ్స్ తో గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో సమంత, చైతు కలిసిన దాఖలాలు లేవు.
తాజాగా సమంత తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న సమంత, విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు. మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజలో పాల్గొన్న ఆమె, తర్వాత స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం తరపున వేద పండితులు మంత్రోఛ్చరణలతో ఆశీర్వదించి తీర్థ - ప్రసాదాలను, జ్ఞాపికలను అందజేశారు.
ఈ ఆధ్యాత్మిక యాత్రికకు కూడా సమంత ఒంటరిగానే వచ్చారు. అక్కినేని కుటుంబానికి చెందిన ఒక్కరు కూడా సమంత పక్కన లేరు. సమంత వ్యక్తిగత సిబ్బందితో ఈ రెండు దేవాలయాలను దర్శించుకున్నారు.
అదే సమయంలో ఓ మీడియా రిపోర్టర్ మీపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించాలని అడుగగా, ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. పవిత్ర గుడిలో ఇలాంటి ప్రశ్నలు ఏంటి, బుద్ది ఉందా... అంటూ తీవ్ర స్థాయిలో కోప్పడ్డారు.
సమంత కోపానికి, ఆవేదన వెనుక అసలు కారణం చైతుతో ఏర్పడిన వైవాహిక సమస్యలే అని చాలా మంది గట్టిగా నమ్ముతారు. నిజంగా సమంతకు చైతూతో గొడవలు లేకుంటే, మీడియాలో ఇంత రచ్చ జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉంటారు. ఖచ్చితంగా ఒక స్పష్టత ఇచ్చేవారు.
సమంత మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి, కఠిన పరిస్థితుల నుండి బయటపడడానికి ఇలాంటి టూర్స్ వేస్తున్నారని పరోక్షంగా అర్థం అవుతుంది. ఏది ఏమైనా అధికారికంగా తెలిసే వరకు ఒక నిర్ణయానికి రావడం సరికాదు.