Ramgopal Varma: తన దేశంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో భోరుమని ఏడుస్తున్న వర్మ హీరోయిన్
Ramgopal Varma's heroine : ఇజ్రాయెల్ దాడులతో తన మాతృభూమి లెబనాన్ రక్తసిక్తం కావడంపై రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ మియా ఖలీఫా కన్నీటి పర్యంతమయ్యారు. యుద్ధం ఆపాలని కోరుతూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

యుద్ధం ఆపండి ప్లీజ్.. కన్నీళ్లతో ప్రాధేయపడుతున్న మియా ఖలీఫా
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య వార్ మొదలైంది. ఈ హింసాత్మక పరిస్థితులపై లెబనీస్-అమెరికన్ మీడియా పర్సనాలిటీ, ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించబోతుందనే ప్రచారంతో తెలుగువారికి సుపరిచితమైన మియా ఖలీఫా తీవ్రంగా స్పందించారు. తన దేశంపై జరుగుతున్న దాడులను చూసి ఆమె భోరున ఏడుస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇది ఎప్పుడు ఆగుతుందంటూ మియా ఖలీఫా కన్నీళ్లు
మియా ఖలీఫా షేర్ చేసిన వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో భయాందోళనతో కనిపిస్తున్నారు. తన మాతృభూమి అయిన లెబనాన్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను చూసి తట్టుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మా కళ్లముందే దాడులు జరుగుతుంటే చూడటం ఎంతో బాధాకరంగా ఉంది. దీనిని వివరించడానికి నా దగ్గర పదాలు లేవు" అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు తనను కలచివేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో వందలాది దాడులు జరగడం దారుణమని ఆమె మండిపడ్డారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇలాంటి హింస కొనసాగడం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోందని ఆమె అన్నారు.
ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్ర విమర్శలు
మియా ఖలీఫా కేవలం తన బాధను పంచుకోవడమే కాకుండా, రాజకీయ విమర్శలు గుప్పించారు. ఈ దాడులను ఆమె ఉగ్రవాదంతో పోల్చారు. "రెండు దేశాలు ఒకరినొకరు మించి యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఉగ్రవాద, ఫాసిస్ట్ దేశాలు. వీరిపై ఒకరోజు హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది" అని ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్పై భారీ దాడులకు దిగడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
లెబనాన్లో మారణహోమం
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్ అతలాకుతలమైంది. లెబనాన్ పౌర రక్షణ విభాగం అందించిన వివరాల ప్రకారం.. బీరుట్, బెకా వ్యాలీ, మౌంట్ లెబనాన్, సిడాన్, దక్షిణ ప్రాంతాల్లోని గ్రామాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 254 మంది ప్రాణాలు కోల్పోగా, 1,100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ చరిత్రలో లెబనాన్పై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ దాడులను సమర్థించుకుంటూ, హిజ్బుల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది. దక్షిణ లెబనాన్ను వేరు చేసి, తమ సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల వరకు బఫర్ జోన్ను ఏర్పాటు చేసే వ్యూహంలో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

