YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
YouTube: టీవీల్లో యూట్యూబ్ చూసే వారికి బ్యాడ్ న్యూస్. ఇకపై వీడియో మధ్యలో 90 సెకన్ల పాటు స్కిప్ చేయలేని యాడ్స్ ను యూట్యూబ్ పరీక్షిస్తోంది. దీనిపై యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ సంచలన నిర్ణయం.. టీవీలో ఇక 90 సెకన్ల అన్స్కిప్పబుల్ యాడ్స్
యూట్యూబ్ తన ప్లాట్ఫారమ్లో విప్లవాత్మక మార్పులు చేస్తూనే, మరోవైపు యూజర్లకు చికాకు కలిగించే నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా స్మార్ట్ టీవీల్లో యూట్యూబ్ చూసే వారి కోసం ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తోంది. ఇకపై వీడియోల మధ్యలో ఏకంగా 90 సెకన్ల పాటు అన్స్కిప్పబుల్ యాడ్స్ ఇవ్వనుంది. అంటే, యాడ్ పూర్తయ్యే వరకు మీరు వేచి చూడాల్సిందే.
యూట్యూబ్ పై యూజర్లు ఫైర్
ఈ కొత్త మార్పును పలువురు గుర్తించే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాము చూస్తున్న వీడియోల మధ్యలో 90 సెకన్ల నిడివి గల యాడ్స్ వస్తున్నాయని, వాటిని స్కిప్ చేసే ఆప్షన్ కూడా రావడం లేదని స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. కేవలం 40 నిమిషాల వీడియోలకే కాదు, 20 నిమిషాల లోపు ఉన్న చిన్న వీడియోలకు కూడా ఇవే ప్రకటనలు వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. దీనివల్ల యూట్యూబ్ చూసే అనుభవం దెబ్బతింటోందని వాపోతున్నారు.
టీవీ చూసే వారికే ఈ కొత్త మార్పులు
ప్రస్తుతానికి ఈ 90 సెకన్ల అన్స్కిప్పబుల్ యాడ్స్ ప్రయోగం కేవలం కనెక్టెడ్ టీవీ వినియోగదారులకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. మొబైల్ లేదా డెస్క్టాప్ వెర్షన్లలో ప్రస్తుతం ఇటువంటి యాడ్స్ కనిపించడం లేదు. గత నెలలో యూట్యూబ్ 30 సెకన్ల యాడ్స్ ను అధికారికం చేయగా, ఇప్పుడు అది ఏకంగా 90 సెకన్లకు చేరడం గమనార్హం. టీవీ వీక్షకులు సాధారణంగా ప్రకటనలకు అలవాటు పడి ఉంటారనే ఉద్దేశంతో యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
సాంప్రదాయ టీవీ బాటలో యూట్యూబ్
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్, తనను తాను నెట్ఫ్లిక్స్ లేదా డిస్నీ ప్లస్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలకు ప్రత్యామ్నాయంగా మార్చుకోవాలని చూస్తోంది. కేబుల్ టీవీలో వచ్చే ప్రకటనల మాదిరిగానే ఇక్కడ కూడా యాడ్ బ్రేక్లను తీసుకురావడం ద్వారా అడ్వర్టైజర్లను ఆకర్షించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. యూజర్లు కేబుల్ టీవీ చూస్తున్న భావన పొందేలా ఈ యాడ్స్ ఉంటున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "యూట్యూబ్ చూసే బదులు నార్మల్ టీవీ చూసుకోవడం బెటర్" అని ఒక యూజర్ అసహనం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ ప్రీమియం సేవలను పెంచే వ్యూహం?
మరోవైపు, ఇన్ని యాడ్స్ చూపించడం వెనుక యూట్యూబ్ మరో వ్యూహం కూడా ఉంది. యూజర్లు విసిగిపోయి యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకునేలా ప్రేరేపించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఇటీవల అమెరికాలో యూట్యూబ్ ప్రీమియం లైట్ అనే తక్కువ ధర ప్లాన్ను కూడా లాంచ్ చేశారు. ప్రకటనలు లేకుండా వీడియోలు చూడాలంటే నెలకు కొంత మొత్తం చెల్లించాల్సిందే అనే దిశగా యూట్యూబ్ అడుగులు వేస్తోంది.
బెంగళూరులో కొత్త టెక్ హబ్
యూట్యూబ్ కేవలం ప్రకటనల మీదనే కాకుండా, తన సాంకేతికతను మెరుగుపరచడంపై కూడా దృష్టి పెట్టింది. టీవీ స్క్రీన్లపై యూట్యూబ్ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, భారతదేశంలోని బెంగళూరులో ఒక కొత్త ఇంజనీరింగ్ హబ్ను ఏర్పాటు చేస్తోంది. టీవీలో వీడియో చూస్తున్నప్పుడు లైవ్ పోల్స్, షాపింగ్ ఇంటిగ్రేషన్ వంటి ఇంటరాక్టివ్ ఫీచర్లను తీసుకురావడానికి ఈ టీమ్ పనిచేయనుంది. అంటే భవిష్యత్తులో టీవీలో వీడియో చూస్తూనే వస్తువులను కొనుగోలు చేసే సదుపాయం రానుంది.
ప్రస్తుతానికి 90 సెకన్ల యాడ్స్ గురించి యూట్యూబ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఈ పరీక్ష విజయవంతమైతే త్వరలోనే అందరు టీవీ యూజర్లకు ఇవి అందుబాటులోకి రానున్నాయి.

