- Home
- Entertainment
- Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్తో యూట్యూబ్ షేక్
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్తో యూట్యూబ్ షేక్
Folk Song: తెలంగాణ జానపద సాహిత్యం మనసును హత్తుకునే భావోద్వేగాలను పంచుతుంది. సోషల్ మీడియా వచ్చాక ఈ పాటలకు మరింత ఆదరణ లభిస్తోంది. తాజాగా యూట్యూబ్ను షేక్ చేస్తూ, కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది మల్లె చెట్టు కింద కూసున్న సాంగ్.

మనసు దోచిన 'మల్లె చెట్టు' సోయగం
ఈ పాట ప్రారంభమే పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. లంగావోణీ ధరించి, రామాలయానికి వెళ్తూ.. దొంగ చూపులు చూస్తున్న అమ్మాయిని చూసి ఒక యువకుడు ఆమెకోసం పడే ఆరాటం ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. "నా మనసు దోచినావే బొమ్మ" అంటూ సాగే పల్లవి, ఆ అమ్మాయి అందానికి కుర్రాడి మనసు ఎంతలా బరువెక్కిందో తెలియజేస్తుంది. వాలుకళ్ల చూపులతో వల వేయడం అనే భావం ఆకట్టుకుంటుంది.
అందానికి నిర్వచనం.. ఆకాశం నుండి దిగివచ్చిన నెలవంక
ఈ పాటలోని చరణాలు అమ్మాయి అందాన్ని ప్రకృతితోనూ, దేవలోక సుందరీమణులతోనూ పోల్చాయి.
దేవలోక సుందరి: రంభ, ఊర్వశి, మేనకలు కూడా అసూయపడేంత అందం ఆమెదని, బ్రహ్మ దేవుడు ఎంతో కష్టపడి ఆమెను తీర్చిదిద్దాడని కవి వర్ణించారు.
నక్షత్రాల రూపం: ఆకాశంలోని చుక్కలన్నీ తెంపి, కుప్పపోసి ఈ బొమ్మను (అమ్మాయిని) చేశారా? అన్నట్లుగా ఉండే వర్ణన అద్భుతం.
చివరికి పారే ఏరు కూడా ఆమె అందాన్ని చూసి ఆగిపోయిందనడం జానపద సాహిత్యంలో ఉండే గొప్ప ఊహశక్తికి నిదర్శనం.
భావోద్వేగాల ప్రవాహం.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
ప్రేమ కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, ఒక బాధ్యత అని ఈ పాట ముగింపులో వివరించారు. "నీ పాదాలను ముద్దాడుతున్న ఆ మట్టి నేనైతే ఎంత బాగుంటుంది.. నీ కురులను సవరించే చల్లని గాలినైతే ఎంత బాగుంటుంది". అని ప్రేమికుడు పడే తపన హృదయానికి హత్తుకుంటుంది. "నువ్వు లేని బతుకు ఊహించలేను, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా" అని ఇచ్చే మాట, ఈ కాలపు యువతకు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది.
యూట్యూబ్లో రికార్డుల సునామీ
ఈ పాట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు. మార్చి 21న యూట్యూబ్లో అప్లోడ్ అయిన ఈ వీడియో, అనతి కాలంలోనే దాదాపు 3 కోట్ల (28,795,148) వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇది #23 టాప్ మ్యూజిక్ వీడియోగా ట్రెండింగ్లో ఉండటం విశేషం. తెలంగాణ జానపదాలకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణకు ఈ పాటే నిదర్శనం.
పాట వెనుక ఉన్న సాంకేతిక బృందం
ఈ పాట ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం వెనుక ఉన్న ప్రతిభావంతులైన టీమ్. ఈ పాటకు శేఖర్ గౌడ్ గుగ్గిళ్ళ నిర్మాతగా వ్యవహరించగా. గుర్రం శ్రవణ్ కుమార్ అద్భుతమైన సాహిత్యం అందించారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. బీ దిలీప్ కుమార్ వాయిస్ ఆకట్టుకుటుంది. ఇక ఈ పాటకు శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. పాటలో లీడ్ రోల్లో నటించిన వైష్ణవి సోనీ - ఈశ్వర్ సాయిల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని చెప్పాలి.

