`కొరియోగ్రాఫర్స్ హీరోగా`.. ట్రెండ్ని కంటిన్యూ చేస్తోన్న జానీ మాస్టర్.. మరో సినిమా అనౌన్స్ మెంట్..
ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ ఒకరు. ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న ఆయన తాజాగా బర్త్ డే సందర్భంగా మరో సినిమాని ప్రకటించారు.
తెలుగు రియాలిటీ డాన్స్ షో `ఢీ`తో డాన్సర్గా తన కెరీర్ని ప్రారంభించిన జానీ మాస్టర్ 2009లో నితిన్, ప్రియమణి జంటగా నటించిన `ద్రోణ` చిత్రంతో కొరియోగ్రాఫర్గా మారారు. బిగినింగ్ నుంచే తన డాన్స్ స్కిల్స్ ని వెండితెరకి పరిచయం చేసి తాను చాలా స్పెషల్ అని నిరూపించుకున్నారు.
వెండితెరపై కథానాయకులతోపాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం సంతోషంగా స్టెప్పులు వేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు... జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్థింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. `జులై`లో `మీ ఇంటికి ముందు..`, `నాయక్`లో `లైలా ఓ లైలా `, `శుభలేఖ రాసుకున్నా..`, `అత్తారింటికి దారేదీ`లో `కెవ్వు కేక, `రేసుగుర్రం`లో ` సినిమా చూపిస్తా మావ.. ` వంటి పాటల్లో తన డాన్స్ తో ఉర్రూతలూగించారు.
దీంతోపాటు 'ఖైదీ నంబర్ 150'లో 'సుందరి...', 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేలు రాణి', 'అల వైకుంఠపురములో' చిత్రంలో 'బుట్టబొమ్మ...', 'ఇస్మార్ట్ శంకర్'లో టైటిల్ సాంగ్, 'రెడ్'లో 'డించక్... డించక్', 'భీష్మ'లో 'వాట్టే వాట్టే బ్యూటీ', ధనుష్ చిత్రం 'మారి-2' లో 'రౌడీ బేబీ' పాటలకు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల 'రాధే'లో 'సిటీమార్...' పాటతో సల్మాన్ అభిమానులు, ఉత్తరాది ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు.
ప్రస్తుతం తమిళ్ టాప్ స్టార్ విజయ్ 'బీస్ట్' చిత్రానికి నృత్య దర్శకత్వం చేస్తున్నారు. అలాగే పలు తెలుగు, తమిళ , కన్నడ స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పుడీ హ్యాండ్సమ్ కొరియోగ్రాఫర్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మురళీ రాజ్ తియ్యాన దర్శకత్వంలో `జే1` వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా రూపొందుతుంది. ఇందులో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్.
తాజాగా తన బర్త్ డే(జులై 2, శుక్రవారం) సందర్భంగా మరో సినిమాని అనౌన్స్ చేశారు. 'మంత్ర'తో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ జోష్ తీసుకొచ్చిన దర్శకుడు ఓషో తులసీరామ్. ఆ సినిమా విజయం తర్వాత ఛార్మితో మరో ప్రామిసింగ్ సినిమా 'మంగళ' తీశారు. హీరోగా తన రెండో సినిమాను ఓషో తులసీరామ్ దర్శకత్వంలో జానీ మాస్టర్ చేస్తున్నారు. ఈ సినిమాకి 'దక్షిణ' టైటిల్ని ఫిక్స్ చేశారు.
త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ, `జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. నిర్మాణ సంస్థ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. అలాగే, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తాం` అని అన్నారు.
ఇప్పటికే కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, లారెన్స్ వంటి వారు హీరోగా సక్సెస్ అయ్యారు. వారి దారిలోనూ ఇప్పుడు జానీ మాస్టర్ కూడా హీరోగా సక్సెస్ కావాలని కోరుకుందాం.