- Home
- Entertainment
- Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
ఈ సంక్రాంతి ఐదు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. కానీ వచ్చే ఏడాది ఏడు సినిమాలు పోటీ పడబోతున్నాయి. అందులో చిరంజీవి, వెంకటేష్, బాలయ్య బాక్సాఫీసు పోరుకి రెడీ అంటున్నారు.

2027 సంక్రాంతికి బాక్సాఫీసు పోరు
సినిమాలకు సంక్రాంతి పండగ అనేది చాలా ముఖ్యమైన డేట్గా మారింది. ఈ టైమ్లో రిలీజ్ చేస్తే ఈజీగా హిట్ కొట్టవచ్చు అని ఈ సంక్రాంతితోనే నిరూపితమయ్యింది. అంతేకాదు కలెక్షన్ల రికార్డ్ లు కొల్లగొట్ట వచ్చని తెలిసిపోయింది. దీంతో వచ్చే సంక్రాంతి ఇప్పుడు చాలా కీలకంగా మారింది. 2027 సంక్రాంతి పండగపై మేకర్స్ కన్నేశారు. అయితే ఇప్పటికే బిగ్ స్టార్స్ టార్గెట్ చేశారు. ఇందులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు ఉండటం విశేషం. వీరికితోడు రజనీకాంత్, ఇద్దరు కుర్ర హీరోలు కూడా వచ్చే సంక్రాంతినే టార్గెట్ చేసినట్టు సమాచారం. కానీ చిరు, బాలయ్య, వెంకీల మధ్య బాక్సాఫీసు పోరు గట్టిగా ఉండబోతుందని చెప్పొచ్చు.
చిరు, బాబీ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్
చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. నయనతార హీరోయిన్. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల రికార్డులు కొల్లగొడుతోంది. రీజినల్ ఫిల్మ్స్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ పక్కన పెడితే లోకల్ రిలీజెస్లో చిరంజీవినే టాప్ అని చెప్పొచ్చు. దీంతో సంక్రాంతి టేస్ట్ ఏంటో చిరుకి తెలిసిపోయింది. ఈ పండగ సీజన్ని క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వచ్చే సంక్రాంతిని కూడా టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మార్చిలో ఇది ప్రారంభం కానుంది. ఈ మూవీని సంక్రాంతికే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. దీంతో చిరంజీవి వచ్చే సంక్రాంతికి కూడా రచ్చ చేయబోతున్నారని చెప్పొచ్చు. కేవీఎన్ ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మిస్తుంది.
వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతికి ఫిక్స్
సంక్రాంతి పోరులో ఇప్పుడు వెంకటేష్ కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం ఇంటి నెం 47`(ఏకే47)లో నటిస్తున్నారు. ఇది ఈ ఏడాదినే రిలీజ్ కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే మరో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికే రానుంది. అనిల్ రావిపూడి తన సినిమా సంక్రాంతికి కచ్చితంగా ఉంటుందని ఇటీవలే చెప్పారు. కాబట్టి వచ్చే సంక్రాంతికి వెంకీ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారట. అయితే చిరంజీవి, వెంకటేష్ ఈ సంక్రాంతి `మన శంకర వర ప్రసాద్ గారు`లో కలిసి నటించారు. కానీ వచ్చే సంక్రాంతికి ఇద్దరి సినిమాలు పోటీ పడబోతుండటం విశేషం. ఈ పోరు రసవత్తరంగా మారనుంది.
చిరు, వెంకీతో పోటీకి బాలయ్య సై
చిరంజీవి, వెంకటేష్ సంక్రాంతికి పోటీపడటమే క్రేజీ అంటే దాన్ని మించిన క్రేజీ విషయం జరగబోతుంది. వచ్చే సంక్రాంతి బరిలో బాలయ్య కూడా దిగబోతున్నారట. ఆయన ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. గ్యాంగ్ స్టర్ కథతో దీన్ని రూపొందిస్తున్నారు గోపీచంద్. ఈ మూవీని కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ముగ్గురు ఒకేసారి థియేటర్లోకి వస్తే అది బాక్సాఫీసు వద్ద రణరంగమే అని చెప్పొచ్చు. అది అభిమానులకు కన్నుల పండగగా ఉండబోతుంది. అదే సమయంలో బాక్సాఫీసు వద్ద బిగ్ ఫైట్ నెలకొనబోతుంది.
సంక్రాంతి బరిలో రజనీకాంత్
ఇది ఓ ఎత్తైతే, ఇప్పుడు మరో సూపర్ స్టార్ సంక్రాంతి బరిలో దిగబోతున్నారట. ఆయనే రజనీకాంత్. కమల్ హాసన్ ప్రొడక్షన్లో రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. సిబి దీనికి దర్శకుడు. ఆ మధ్యనే దీన్ని ప్రకటించారు. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. రజనీకాంత్ సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రెయిట్ మూవీస్ తరహాలోనే విడుదలవుతుంటాయి. దీంతో ఇది సంక్రాంతి మూవీస్కి గట్టి పోటీ ఇవ్వబోతుందని చెప్పొచ్చు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ల మధ్య పోటీనే ఆద్యంతం ఆసక్తికరంగా, క్రేజీగా మారితే, వీరితో రజనీకాంత్ పోటీ పడటం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. దీంతో వచ్చే సంక్రాంతి అదిరిపోయేలా ఉంటుందని చెప్పొచ్చు. బాక్సాఫీసు వద్ద పోరు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉండబోతుందని చెప్పొచ్చు.
శర్వానంద్, శ్రీనువైట్ల ఫిల్మ్ సంక్రాంతికే
వీరికితోడు కుర్ర హీరోలు కూడా వచ్చే సంక్రాంతికి స్లాట్ని బుక్ చేసుకుంటున్నారట. ఈ సంక్రాంతికి `నారీ నారీ నడుమ మురారి`తో హిట్ అందుకున్న శర్వానంద్ కూడా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేశాడట. శర్వానంద్ ప్రస్తుతం `బైకర్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత శ్రీనువైట్లతో ఓ మూవీ చేస్తున్నారు. కామెడీ ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీని కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.
జాంబిరెడ్డి 2 సంక్రాంతికే
తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. ఆయన `హనుమాన్`, `మిరాయ్` చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు `జాంబి రెడ్డి 2` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారట. రానా నాయుడు వెబ్ సిరీస్ని రూపొందించిన సూపర్న్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించారు.
రష్మిక మందన్నా మైసా కూడా సంక్రాంతికే
అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మెయిన్ లీడ్గా రూపొందుతున్న `మైసా` మూవీ కూడా సంక్రాంతికే రానుందట. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో వారియర్ క్వీన్గా రష్మిక కనిపించబోతుంది. విడుదలైన టీజర్ మతిపోయేలా ఉంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీ కూడా సంక్రాంతికి రాబోతుందని సమాచారం. ఇలా దాదాపు ఏడు సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో దిగాయి. అలాగే సితార బ్యానర్ నుంచి కూడా ఓ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుందని సమాచారం. చూడబోతుంటే వచ్చే సంక్రాంతి వేరే లెవల్ రచ్చ ఉండబోతుందని అర్థమవుతుంది. దీంతో 2027 సంక్రాంతికి బాక్సాఫీసు పోరు ఇప్పట్నుంచే హీటెక్కిస్తుందని చెప్పొచ్చు.

