- Home
- Entertainment
- Balakrishna Birthday Special: ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్, అభిమానులకు బాలయ్య ఇవ్వబోతున్న కొత్త ట్రీట్స్ ఇవే
Balakrishna Birthday Special: ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్, అభిమానులకు బాలయ్య ఇవ్వబోతున్న కొత్త ట్రీట్స్ ఇవే
నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను వరుస ట్రీట్లతో సర్ప్రైజ్ చేయబోతున్నారు. మూడు సినిమాల రిలీజ్, రెండు కొత్త సర్ప్రైజ్లు రాబోతున్నాయి.

బాలకృష్ణ బర్త్ డే స్పెషల్
నందమూరి నటసింహం బాలకృష్ణ.. రేపు బుధవారం(జూన్ 10) తన 66వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీంతో నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. అభిమానులు అంతా సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈ రోజు నుంచే ఈసెలబ్రేషన్ స్టార్ట్ కాబోతుందని చెప్పొచ్చు. ఈ సారి బాలయ్య పుట్టిన రోజుని మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసే పనిలో అభిమానులు ఉన్నారు. పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే `భోళా బాలయ్య` పేరుతో ఆయనపై ఓ పాటని విడుదల చేశారు. అది బాగా ఆదరణ పొందుతోంది. దీంతోపాటు ఓ ఈవెంట్ని కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఒకే రోజు మూడు సినిమాలు రీ రిలీజ్
ఈ క్రమంలో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్నారు బాలయ్య. వారికి సినిమాల పండగని ఇవ్వబోతున్నారు. ఒకే రోజు బాలయ్య నటించిన మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. బాలయ్య కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన, ఆయన కెరీర్ని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అందులో `భైరవద్వీపం`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి చిత్రాలున్నాయి. ఈ మూడు సినిమాలు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న రీ రిలీజ్ అవుతుండటం విశేషం.
సమరసింహారెడ్డి రీ రిలీజ్
`భైరవద్వీపం` చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, ఇది మైథాలజీ, ఫాంటసీ, యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇందులో రోజా హీరోయిన్గా నటించింది. బి వెంకటరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 14న విడుదలైంది. అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఇక రేపు విడుదల కాబోతున్న `సమరసింహారెడ్డి` చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించగా, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అంజలా జవేరీ, సిమ్రాన్, సంఘవి హీరోయిన్లుగా నటించారు. చెంగాల వెంకట్రావ్ నిర్మించారు. 1999 జనవరి 13న విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
నరసింహనాయుడు రీ రిలీజ్
బాలయ్య కెరీర్లో మరో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మూవీ `నరసింహనాయుడు`. ఇది కూడా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇందులో సిమ్రాన్, ప్రీతి జింగాని, ఆశా సైనీ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఎంవీ మురళీ కృష్ణ నిర్మించిన ఈ మూవీ 2001 జనవరి 11న విడుదలైంది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూడు సినిమాలు ఇప్పుడు ఒకే రోజు రీ రిలీజ్ కావడం విశేషం. అభిమానులకు పండగే పండగ అని చెప్పొచ్చు.
ఎన్బీకే 111 టైటిల్ గ్లింప్స్ రాబోతుంది
ఇదిలా ఉంటే ఇదే కాదు అభిమానులకు అదిరిపోయే మరో రెండు ట్రీట్లు రెడీ చేశారు బాలయ్య. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `ఎన్బీకే111` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రాబోతుంది. దీన్ని రేపు బుధవారం విడుదల చేస్తున్నారు. ఇది వేరే లెవల్లో ఉంటుందట. దీనికి మ్యూజిక్ అందిస్తోన్న థమన్ ఈ విషయాన్ని తెలిపారు. గతంలో ఎప్పుడూ చూడని బాలయ్యని ఇందులో చూస్తారని తెలిపారు. సినిమా వేరే లెవల్ అని తెలిపారు. ఇప్పుడు రాబోతున్న గ్లింప్స్ కూడా పూనకాలు తెప్పించేలా ఉంటుందని సమాచారం. ముంబాయి మాఫియా నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో బాలయ్య గ్యాంగ్ స్టర్గా కనిపిస్తారని సమాచారం.
కొరటాల శివతో సినిమా ప్రకటన
దీంతోపాటు మరో సర్ప్రైజ్ రాబోతుందట. అదే కొత్త సినిమా ప్రకటన. సంచలన కాంబినేషన్లో సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతుందట. బాలయ్య నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అధికారికంగా ప్రటించబోతున్నారట. అలాగే మరో సినిమాకి సంబంధించిన విషెస్ పోస్టర్ కూడా రాబోతుందని సమాచారం. మొత్తంగా ఈ పుట్టిన రోజున బాలయ్య తన అభిమానులకు గ్యాప్ లేకుండా ట్రీట్స్ ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు.

