మగబిడ్డ పుట్టడం గొప్పేం కాదు.. అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు
మగబిడ్డ పుడితే విశేషమని అందరు భావిస్తుంటారు. కానీ అది సరికాదు. ఆ భావన నుంచి బయటపడాలి` అని అంటోంది అనుష్క శర్మ.
ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించి తన అభిమానులను సర్ప్రైజ్ చేసింది అనుష్క శర్మ. జనవరిలో వీరికి పండంటి బిడ్డ పుట్టబోతున్నట్టు తెలిపింది. మూడేళ్ళ క్రితం టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో అనుష్క వివాహం జరిగింది విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రాస్ ఘటన విషయంలో అనుష్క శర్మ స్పందించి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతటి దారుణమైన ఘటన గురించి వినాల్సి వచ్చిందని, అమ్మాయిల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తించే రాక్షుసలు కూడా ఉన్నారా? అని మండిపడింది.
ఇంకా అనుష్క చెబుతూ, మగబిడ్డ పుడితే మన సమాజం విశేషంగా, అదేదో గొప్పగా చెప్పుకుంటుంటారు. వాస్తవానికి ఆడ బిడ్డ పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదని చెప్పింది. మగబిడ్డ పుట్టడం అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు దూరదృష్టితో ఆలోచించాలని పేర్కొంది.
స్త్రీని గౌరవించే విధంగా అబ్బాయిని పెంచినప్పుడే గొప్పగా భావించాలి. సమాజ శ్రేయస్సు కోసం అలా చేయడం ప్రతి పేరెంట్స్ బాధ్యత. లింగ భేదం ఎవర్నీ గొప్పవారిని చేయదు. దయజేసి మగ బిడ్డ పుట్టుక ఓ విశేషంగా భావించొద్దు.
సమాజంలో బతకడానికి మహిళలు సురక్షితంగా, క్షేమంగా భావించాలి. ఇలా ప్రతి ఒక్కరు తమ బిడ్డల్ని పెంచాలని అనుష్క చెప్పింది. అంతేకాదు తమకు పుట్టబోయేది మగ అయినా, ఆడ అయినా ఓకే అని తెలిపింది.
అనుష్క శర్మ చివరగా `జీరో` చిత్రంలో నటించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా మరో సినిమా చేయలేదు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా రూపొందే `ఆదిపురుష్`లో సీత పాత్రలో అనుష్క శర్మని ఎంపిక చేసినట్టు సమాచారం.