Team India: మూడు ఫార్మాట్లలో భారత జట్టును నడిపించిన నాయకులు ఎవరో తెలుసా?
Team India: భారత జట్టుకు టెస్ట్, వన్డే, టీ20ల్లో నాయకత్వం వహించే అరుదైన అవకాశం ఇప్పటివరకు ఆరుగురు ప్లేయర్లకు మాత్రమే లభించింది. ధోని, విరాట్ తో పాటు ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్సీ చేసిన ప్లేయర్లు
క్రికెట్ చరిత్రలో టీమిండియాకు టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించిన అరుదైన ఘనతను సాధించిన ప్లేయర్లు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఆ ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆసక్తికరంగా ఆకర్షిస్తున్నాయి. వీరిలో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారి వివరాలు గమనిస్తే..
వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ తనదైన దూకుడు ఆటతో భారత క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు నాయకత్వం వహించిన తొలి భారత ప్లేయర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఘనత సాధించారు.
సెహ్వాగ్ టెస్ట్ కెప్టెన్సీని 2003 చేపట్టారు. వన్డే కెప్టెన్సీని 2005లో చేపట్టారు. అలాగే, సెహ్వాగ్ భారత్ తరఫున 2006లో జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. తక్కువ కాలం మాత్రమే కెప్టెన్గా ఉన్నప్పటికీ, అతను ఎంఎస్ ధోనికి చాలా కాలం డిప్యూటీగా పనిచేశారు.
ఎంఎస్ ధోని
కెప్టెన్ కూల్, లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో పూర్తి స్థాయి కెప్టెన్గా వ్యవహరించిన తొలి ఆటగాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో భారత జట్టు ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు.
2009లో భారత్ను టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్ ఎంఎస్ ధోని. అతను 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు.
విరాట్ కోహ్లీ
ఎంఎస్ ధోని నాయకత్వంలో టీమిండియాలో అదరగొట్టిన రన్ మిషన్ విరాట్ కోహ్లీ.. కెప్టెన్ గా కూడా దుమ్మురేపాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు.
కోహ్లీ నాయకత్వంలో భారత్ 2018-19 సీజన్లో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ గా కోహ్లీ అద్భుతమైన విజయాలు అందించాడు. కానీ, అతని నేతృత్వంలో భారత్ ఐసీసీ ట్రోఫీని మాత్రం గెలవలేకపోయింది.
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ తర్వాత 2021-22 సీజన్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. అతను టెస్ట్, టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత వెంటనే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నాడు.
రోహిత్ నేతృత్వంలో భారత్ 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ప్రస్తుతం అతను 2027 వన్డే వరల్డ్ కప్కు జట్టు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు.
అజింక్య రహానే
అజింక్య రహానే భారత టెస్ట్ జట్టుకు ఐదేళ్లకుపైగా వైస్-కెప్టెన్గా సేవలందించాడు. వన్డే, టీ20లలోనూ అతను తాత్కాలిక వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అతను 6 టెస్టులు, 3 వన్డేలు, 2 టీ20లలో భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు.
2020-21లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీని రహానే నాయకత్వంలో భారత్ గెలుచుకుంది. అతని నాయకత్వంలో భారత్ మూడు వన్డే మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించింది.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ ఒకానొక సమయంలో అన్ని ఫార్మాట్లకు వైస్-కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ శర్మ తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, తన పేలవ ఫామ్ కారణంగా ఆ అవకాశం కోల్పోయాడు. అంతేకాకుండా, అతను టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం టెస్ట్, వన్డే జట్లలో తిరిగి చోటు సంపాదించాడు. కేఎల్ రాహుల్, 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి టీ20ల్లో ఆడలేదు.
ఈ ఆరుగురిలో ప్రతి ఒక్కరూ విభిన్న శైలిలో నాయకత్వం వహించి తమదైన ముద్రవేస్తూ.. భారత జట్టును ముందుకు నడిపించారు.