- Home
- Sports
- Cricket
- MI vs SRH: ర్యాన్ రికెల్టన్ విశ్వరూపం.. ముంబై ఇండియన్స్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డుల వేట !
MI vs SRH: ర్యాన్ రికెల్టన్ విశ్వరూపం.. ముంబై ఇండియన్స్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డుల వేట !
MI vs SRH : ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్పై ముంబై ఇండియన్స్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ సెంచరీతో దుమ్మురేపాడు. కేవలం 44 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది, జయసూర్య, తిలక్ వర్మ రికార్డులను బద్దలు కొట్టాడు.

ర్యాన్ రికెల్టన్ ఊచకోత.. 44 బంతుల్లోనే సెంచరీతో ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు
ముంబైలోని వంఖేడే స్టేడియం బుధవారం రాత్రి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో దద్దరిల్లింది. ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న రికెల్టన్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఏళ్ల నాటి రికార్డులను బద్దలుకొట్టాడు.
రికార్డుల వేటలో ర్యాన్ రికెల్టన్
ఈ మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు సనత్ జయసూర్య (2008), తిలక్ వర్మ (2026) పేరిట ఉండేది. వీరిద్దరూ 45 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నారు. అయితే, రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే ఈ ఘనత సాధించి వారిని అధిగమించాడు. రికెల్టన్ ఇన్నింగ్స్ మొత్తం 55 బంతుల్లో 123 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇది ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. గతంలో జయసూర్య చేసిన 114 పరుగుల రికార్డును ఆయన బద్దలు కొట్టాడు.
ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
- ర్యాన్ రికెల్టన్ 44 బంతుల్లో సెంచరీ vs ఎస్ఆర్హెచ్ (2026)
- తిలక్ వర్మ 45 బంతుల్లో సెంచరీ vs జీటీ (2026)
- సనత్ జయసూర్య 45 బంతుల్లో సెంచరీ vs సీఎస్కే (2008)
- కెమెరూన్ గ్రీన్ 47 బంతుల్లో సెంచరీ vs ఎస్ఆర్హెచ్ (2023)
- సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో సెంచరీ vs జీటీ (2023)
ఫోర్లు, సిక్సర్ల వర్షం
క్వింటన్ డికాక్ గాయం కారణంగా అతని ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ర్యాన్ రికెల్టన్, తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగి, విల్ జాక్స్తో కలిసి మొదటి వికెట్కు కేవలం 7 ఓవర్లలోనే 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, రికెల్టన్ ఏమాత్రం తగ్గలేదు. తన ఇన్నింగ్స్లో మొత్తం 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తరహాలో తన హెల్మెట్ను బ్యాట్ పైన ఉంచి గాల్లోకి లేపుతూ సంబరాలు చేసుకున్నాడు.
చివరలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మెరుపులు
నమన్ ధీర్ 22 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. రికెల్టన్ కాస్త అలసిపోయినట్లు కనిపించిన సమయంలో, పాండ్యా బాధ్యత తీసుకుని 15 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో రన్రేట్ తగ్గకుండా ముంబై భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. పాండ్యా అవుట్ అయిన తర్వాత రికెల్టన్ మళ్ళీ విజృంభించి ఇన్నింగ్స్ ముగిసే సరికి స్కోరును 243 పరుగులకు చేర్చాడు. ఇది వంఖేడే స్టేడియంలో నమోదైన అత్యధిక ఐపీఎల్ స్కోరు కావడం గమనార్హం.

