- Home
- Sports
- Cricket
- RCB : ఇదెక్కడి మాస్రా మావా.. 75 పరుగులకే ఢిల్లీ ఫినిష్.. 9000 పరుగులతో కోహ్లీ రచ్చ !
RCB : ఇదెక్కడి మాస్రా మావా.. 75 పరుగులకే ఢిల్లీ ఫినిష్.. 9000 పరుగులతో కోహ్లీ రచ్చ !
RCB : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ను 75 పరుగులకే ఆలౌట్ చేసి, కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. విరాట్ కోహ్లీ తొలి ప్లేయర్ గా మరో అద్భుతమైన రికార్డును అందుకున్నాడు.

ఆర్సీబీ ఊచకోత.. ఢిల్లీ విలవిల.. రికార్డుల వేటలో బెంగళూరు
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 39వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుచిత్తుగా ఓడించింది. బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ, 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి రికార్డుల మోత మోగించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఆర్సీబీ బౌలర్లు జోష్ హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో నిప్పులు చెరిగారు. కేవలం 4 ఓవర్లలోనే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హేజిల్ వుడ్ తన స్పెల్లో కేవలం 12 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీని కోలుకోలేని దెబ్బకొట్టాడు. భువనేశ్వర్ కుమార్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీయడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది.
75 పరుగులకే ఆలౌట్.. ఢిల్లీ అత్యల్ప స్కోరు ఇదే
ఢిల్లీ బ్యాటర్లలో ఎవరూ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. అభిషేక్ పోరెల్ (30), డేవిడ్ మిల్లర్ (19) కొంత సేపు క్రీజులో ఉన్నారు. కానీ, మిగిలిన వారు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. వరుస వికెట్లు పడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇది మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది.
విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి.. 9000 పరుగులు పూర్తి
చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 9000 పరుగుల మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించాడు. అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో సింగిల్ తీయడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. స్టేడియం అంతా కోహ్లీ.. కోహ్లీ అనే నినాదాలతో హోరెత్తిపోయింది.
మెరుపు వేగంతో ఛేదన.. పడిక్కల్ విధ్వంసం
లక్ష్యం చిన్నదే అయినా ఆర్సీబీ బ్యాటర్లు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే 34 పరుగులు చేసి జట్టు విజయాన్ని చాలా ఈజీగానే అందించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (12 బంతుల్లో 23 పరుగులు) సిక్సర్తో మ్యాచ్ను ముగించి జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రికార్డుల మోత మోగించిన మ్యాచ్
ఈ మ్యాచ్ పలు రికార్డులు నమోదయ్యాయి. వాటిలో..
• జోష్ హేజిల్ వుడ్ (4/12) తన టీ20 కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.
• విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు.
• ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ప్లేలో 9 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి అత్యంత ఘోరమైన ఆరంభాన్ని చవిచూసింది.
• భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

