RCB: అమ్మకానికి ఆర్సీబీ జట్టు.. ధర ఎంత.? ఎందుకు అమ్మనున్నారంటే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు యాజమాన్యం త్వరలో మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్లో తొలిసారి ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీకి సంబంధించి ఈ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ధర ఎంతో తెలుసా.?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రస్తుతం బ్రిటిష్ కంపెనీ డియాజియో (Diageo Plc) యజమానిగా ఉంది. ఈ వ్యవహారాలన్నింటీ దాని భారత శాఖ యునైటెడ్ స్పిరిట్స్ చూసుకుంటోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, డియాజియో తన వాటాలో కొంత భాగాన్ని లేదా మొత్తం అమ్మే దిశగా ఆలోచిస్తోంది.
ఇప్పటికే సలహాదారులతో చర్చలు ప్రారంభమయ్యాయనీ, మొత్తం జట్టు విలువను అందరూ $2 బిలియన్ల వరకు అంచనా వేస్తున్నారట. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 16 వేల కోట్లు. ఇప్పటికే దీనివల్ల స్టాక్ మార్కెట్లో యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు 3.3% వరకు పెరిగాయి. ఇది ఐదు నెలల గరిష్ఠ స్థాయి కావడం విశేషం.
అమ్మకానికి కారణాలు ఏంటి.?
వ్యాపార వ్యూహంలో మార్పులు
డియాజియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని సులభతరం చేసే దిశగా పని చేస్తోంది. అమెరికాలో ఆల్కహాల్ అమ్మకాలు తగ్గిపోవడం, సుంకాలు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో RCBని అమ్మడం ద్వారా తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు నిధులు సేకరించాలనుకుంటోంది.
ప్రభుత్వ నియంత్రణ
ప్రభుత్వం స్పోర్ట్స్ ఈవెంట్లలో ఆల్కహాల్, తంబాకు అనుబంధ ప్రకటనలను నిషేధించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే డైరెక్ట్ ప్రకటనలు నిషేధించారు. అయితే డియాజియో వంటి కంపెనీలు సోడా బ్రాండ్ పేరుతో క్రికెటర్లను ఉపయోగించి ప్రచారం చేస్తున్నాయి. నిబంధనలు మరింత కఠినతరం అయితే బ్రాండ్ నేమ్ పబ్లిసిటీకి అవకాశం తగ్గుతుందని భావిస్తున్నారు.
ఆర్సీబీ చరిత్ర ఏంటంటే.?
ఆర్సీబీని మొదట విజయ్ మాల్యా కొనుగోలు చేశాడు. తరువాత మాల్యా వ్యాపారం కుదేలవడంతో డియాజియో, యునైటెడ్ స్పిరిట్స్ను కొనుగోలు చేసి RCBపై అధికారం పొందింది. RCBలో విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఒక్క ట్రోపీని సొంతం చేసుకోలేదు.
అయితే తాజా సీజన్ను సొంతం చేసుకుంది. దీంతో జట్టు విలువ, ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. ఈ కారణంగానే జట్టును విక్రయించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.
IPL విలువ పెరుగుతోంది
IPL ఇప్పటికీ కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది ప్రపంచంలో అత్యంత విలువైన లీగ్స్లో ఒకటిగా మారింది. మూడు గంటల మ్యాచ్ ఫార్మాట్ టీవీ, డిజిటల్ మార్కెట్లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆర్సీబీ అమ్మకానికి సంబంధించిన వస్తున్న ప్రతిపాదనలు, ధరను బట్టి చూస్తే.. ఫ్రాంచైజీల విలువ ఎంతగా పెరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది.