ఎమోషన్స్ పక్కన పెట్టండి... IPL ముందు వారికి ఇచ్చిపడేసిన సంజూ !
Sanju Samson : ఐపీఎల్ 2026కు ముందు సంజూ శాంసన్ తన మాజీ జట్టు రాజస్థాన్ రాయల్స్పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. భావోద్వేగాలకు లోనుకాకుండా బెస్ట్ క్రికెట్ ఆడతానని తెలిపాడు.

రాజస్థాన్పై సంజూ శాంసన్ స్ట్రాంగ్ స్టేట్మెంట్
టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ప్రారంభానికి ఇంకా కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్ని జట్లు ఇప్పటికే మెగా టోర్నీ కోసం సన్నాహాలు ప్రారంభించాయి. అయితే ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ పూర్తిగా ప్రకటించలేదు. శాసనసభ ఎన్నికల కారణంగా మొదటగా కేవలం 20 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే ఐపీఎల్ నిర్వహణ కమిటీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించాయి. మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను తరువాత విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జట్లు తమ ప్రాక్టీస్ క్యాంప్లను ప్రారంభించాయి. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా ఇప్పటికే శిక్షణ ప్రారంభించింది. అయితే జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇంకా క్యాంప్లో చేరలేదు. వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు.
రాజస్థాన్ రాయల్స్పై సంజూ శాంసన్ ఘాటు వ్యాఖ్యలు
సంజూ శాంసన్ ఇటీవల రాజస్థాన్ రాయల్స్ (RR) నుండి చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ అయ్యాడు. ఈ ట్రేడ్లో భాగంగా రవీంద్ర జడేజా, సామ్ కరన్తో ప్లేయర్ స్వాప్ జరిగింది. ఈ ఒప్పందం ద్వారా సంజూ శాంసన్ చెన్నై జట్టులో చేరి రూ.18 కోట్ల జీతంతో ఆడనున్నాడు.
ఐపీఎల్లో తన మాజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ను ఎదుర్కోవడం గురించి పీటీఐ సంస్థ సంజూ శాంసన్ ను ప్రశ్నించింది. దీనికి స్పందించిన సంజూ.. “ఇది నేను రాజస్థాన్ రాయల్స్కు వ్యతిరేకంగా ఆడబోయే మొదటి సారి. కానీ మైదానంలో భావోద్వేగాలు నన్ను ప్రభావితం చేయనివ్వను. రాజస్థాన్ జట్టులో నా సమయం ముగిసిందని అనిపించడంతోనే నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు వారిని ఎదుర్కొన్నా నేను నా బెస్ట్ క్రికెట్ ఆడతాను” అని తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ ఫామ్ కొనసాగించాలనే లక్ష్యంతో సంజూ
సంజూ శాంసన్ ఇటీవల జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అతని బ్యాటింగ్ ప్రదర్శనకు గాను టోర్నమెంట్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును అందుకున్నాడు.
ఆ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన సంజూ శాంసన్ మొత్తం 321 పరుగులు చేశాడు. అతని సగటు 80కు పైగా ఉంది. భారత జాతీయ జట్టులో చోటు సంపాదించినప్పటి నుంచి అతను తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
VIDEO | Thiruvananthapuram, Kerala: “This is the first time I will play against Rajasthan Royals, but I don't let emotions rule me on the field. I left Rajasthan Royals because I felt my time in the team was over. Even if we come up against them now, I will play my best cricket,”… pic.twitter.com/yhzyONME20
— Press Trust of India (@PTI_News) March 16, 2026
సంజూ ఐపీఎల్ ప్రయాణం ఇదే
సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అతను మొత్తం 177 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతని నాలుగో ఫ్రాంచైజీగా నిలిచింది.
2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సంజూ శాంసన్ ఎక్కువ రాజస్థాన్ రాయల్స్ తరఫునే ఆడాడు. 2016, 2017 సీజన్లలో మాత్రమే అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మిగిలిన సీజన్లన్నింటిలోనూ అతను రాజస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు.
ధోని టీమ్ లోకి సంజూ.. 2025 సీజన్ తర్వాత సిఎస్కే లక్ష్యం అదే
సంజూ శాంసన్ గతంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. 2022 ఐపీఎల్ ఫైనల్కు ఆ జట్టును తీసుకెళ్లాడు. అయితే ఆ మ్యాచ్లో రాజస్థాన్ పరాజయం పాలైంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతను కెప్టెన్ కాదు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆడనున్నాడు.
2025 ఐపీఎల్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్కు చాలా నిరాశ కలిగించింది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఈ జట్టు మొదటిసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఈసారి ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సీజన్ కోసం సీఎస్కే తమ వ్యూహంలో మార్పులు చేసింది. అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్లను ఒక్కొక్కరిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. 2023 తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో సీఎస్కే ఈసారి బరిలోకి దిగుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ ఇదే
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అయుష్ మాత్రే, ఎంఎస్ ధోని, సంజూ శాంసన్ , డేవాల్డ్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్, శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జప్నీత్ సింగ్, శ్రేయాస్ గోపాల్, ముకేష్ చౌదరీ, నాథన్ ఎల్లిస్, ఆకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, మ్యాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్క్స్.

