నేను పడిపోగానే, ధోనీ నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు... అందకే మాహీ బెస్ట్ కెప్టెన్... - ఫాఫ్ డుప్లిసిస్...
మందు, సిగరెట్ల్లాగే క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఓ వ్యసనం. మాహీని ఇష్టపడడం మొదలెడితే, అతన్ని ఆరాధిస్తూనే ఉంటాం. మాహీ అంతగా ఏం చేశాడంటే... చెప్పడం కష్టమే. కానీ అతని వ్యక్తిత్వమే, మహేంద్ర సింగ్ ధోనీని మిగిలిన వారి నుంచి వేరు చేసింది...
సౌతాఫ్రికా సీనియర్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఫాఫ్ డుప్లిసిస్ కూడా మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానిని అయిపోయానంటూ ప్రకటించాడు. డుప్లిసిస్ ఈ మాట అనడానికి కారణం మాత్రం ఆరేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన.
2015లో సౌతాఫ్రికా జట్టు, భారత్ పర్యటనకి వచ్చింది. ఆ సమయంలో టీమిండియాతో ఆడిన వన్డే సిరీస్లో మహేంద్ర సింగ్ ధోనీ, తన క్రీడా స్ఫూర్తిని చూపించి క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు.
వాంఖడేలో జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. డుప్లిసిస్తో పాటు డి కాక్, ఏబీ డివిల్లియర్స్ సెంచరీలతో కదం తొక్కారు. 115 బంతుల్లో 9 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 133 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్... తొడ కండరాలు పట్టేయడంతో మైదానంలో నడవడానికి కూడా ఇబ్బందిపడి పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న ధోనీ, అతని దగ్గరికి వచ్చి, ఫిజియోగా మారి సాయం చేశాడు.
‘ఆ రోజు నేను పడిపోగానే, ధోనీ నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు. నా కాళ్లు పట్టుకుని ఒత్తుతూ ఇప్పుడు ఎలా ఉందని అడిగాడు. నాకు మాటలు రాలేదు... ఇందుకే నువ్వు వరల్డ్ బెస్ట్ కెప్టెన్వి అయ్యావనుకుంటా అన్నాను...’ అంటూ చెప్పుకొచ్చాడు డుప్లిసిస్.
‘ధోనీ చాలా కూల్ అండ్ కామ్. వరల్డ్లో నాకు తెలిసిన బెస్ట్ ఫినిషర్ మాహీయే. అతను బ్యాటింగ్ చేస్తుంటే, నాన్ స్టైయికింగ్ ఎండ్ నుంచి చూడడం అద్భుతంగా ఉంటుంది.
ధోనీలా ఆడాలని చాలామంది ప్రయత్నించారు. కానీ ఎవ్వరి వల్లా కాలేదు. ఎందుకంటే మాహీ చాలా ప్రత్యేకం. గేమ్ను అతను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ప్లేయర్లను చదువుతాడు. క్షణాల్లో జట్టుకి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాడు.
ధోనీ కెప్టెన్సీలో ఆడడం నాకు చాలా మంచి అనుభవం. మీటింగ్స్లో కెప్టెన్ మాట్లాడాలని నేను ఎదురుచూస్తూ ఉంటాను. కానీ ధోనీ పూర్తిగా డిఫరెంట్. అతను మీటింగ్స్ను నమ్మడు. మైదానంలో క్రికెట్ను మాత్రమే నమ్ముతాడు...’ అని చెప్పుకొచ్చాడు డుప్లిసిస్.
గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచిన డుప్లిసిస్, 13 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 449 పరుగులు చేశాడు. ఈ సీజన్లోనూ 7 మ్యాచులు ఆడి 320 పరుగులు చేసి సీఎస్కే తరుపున టాప్లో నిలిచాడు డుప్లిసిస్.
ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్ నుంచి తప్పుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుండడంతో చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్ సారథిగా ఫాఫ్ డుప్లిసిస్ పేరు వినిపిస్తోంది. ఫాఫ్తో పాటు జడేజా కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.