Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు కారణం ఆర్సీబీ.. కర్నాటక సర్కారు రిపోర్టు
Bengaluru Stampede: ఆర్సీబీ ముందస్తు అనుమతులు లేకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు. ఆర్సీబీపై క్రిమినల్ చర్యలతో పాటు పలు కీలక విషయాలను కర్నాటక సర్కార్ తన నివేదికలో పేర్కొంది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట.. ఆర్సీబీదే తప్పు
2025 జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన భారీ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ను ప్రధాన బాధ్యుడిగా పేర్కొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయపడ్డారు.
ముందస్తు అనుమతులు లేకుండా విజయోత్సవానికి పిలుపు
కర్ణాటక హైకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం, జూన్ 3న ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన అనంతరం, ఆర్సీబీ యాజమాన్యం డీఎన్ఏ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, KSCAతో కలిసి బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ కార్యక్రమం కోసం నగర పోలీసులతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా, అవసరమైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు చేపట్టారని పేర్కొంది.
‘ఇంటిమేషన్’ మాత్రమే ఇచ్చారు.. అనుమతి కోరలేదు
నివేదిక ప్రకారం, జూన్ 3 సాయంత్రం 6:30 గంటలకు KSCA తరఫున DNA నెట్వర్క్స్ ఒక లేఖను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్కు సమర్పించింది. అయితే అది పూర్తి సమాచారం లేని ‘ఇంటిమేషన్’ మాత్రమే కాగా, కార్యక్రమానికి అవసరమైన అనుమతి ఫార్మాట్లో దరఖాస్తు చేయలేదు. తగిన సమాచారం లేకపోవడంతో కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు.
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ వీడియోతో కలకలం
అనుమతులు లేకపోయినా, ఆర్సీబీ జూన్ 4 ఉదయం 7:01 గంటలకు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విజయ ర్యాలీని ప్రకటించింది. ఉదయం 8:55కి ప్రముఖ ఆటగాడు విరాట్ కోహ్లీ పాల్గొన్న వీడియోను పోస్టు చేయడంతో, అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3:14 గంటలకు మాత్రమే “ఫ్రీ పాసులు అవసరం” అని తెలిపింది. దీంతో అప్పటికే వేలాదిగా జనసందోహం అక్కడికి చేరుకుంది.
మూడున్నర లక్షల మంది గుమికూడినట్లు అంచనా
బెంగళూరు మెట్రో రైలు సంస్థ (BMRCL) జూన్ 4న 9.66 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేసింది, సాధారణంగా ఇది 6 లక్షలుగా ఉంటుంది. కాలినడకన, ప్రైవేటు వాహనాల్లో వచ్చిన వారితో కలిపితే మూడు లక్షలకుపైగా జనాలు హాజరైనట్లు నివేదిక అంచనా వేసింది. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మాత్రమే అయినప్పటికీ, జనాలు ప్రవేశద్వారాల వద్ద భారీగా గుమికూడారు.
ప్రవేశ ద్వారాలు తెరవకపోవడంతో తొక్కిసలాట
మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత, ద్వారాలు సమయానికి తెరవకపోవడంతో అభిమానులు గేట్లు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించారు. 1, 2, 21 వంటి గేట్ల వద్ద గేట్లు తెరిచే సమన్వయం లేకపోవడంతో తొక్కిసలాట ఏర్పడింది. 2, 2A, 6, 7, 15, 17, 18, 20, 21 గేట్ల వద్ద తాత్కాలిక తొక్కిసలాటలు జరిగాయి. పోలీసులు హుటాహుటిన స్పందించినా, ఇప్పటికే పరిస్థితి అదుపుతప్పింది.
వేడుక నిలిపివేయకపోవడానికి కారణాలు
పోలీసులు వేడుకను రద్దు చేయాలా అనే అంశాన్ని పరిగణించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో వేడుక రద్దు చేస్తే శాంతిభద్రతలకు హానికలగే ప్రమాదం ఉన్నట్లు భావించారు. అందుకే కార్యక్రమాన్ని తగ్గించిన వ్యవధితో కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. "అభిమానం, ఆగ్రహం, సమాచారం లోపంతో కూడిన జనం మధ్య వేడుకను ఒక్కసారిగా నిలిపివేయడం ఊహించని ఉద్రిక్తతలకు దారితీస్తుందనే ఆందోళనతో నిర్ణయం తీసుకున్నాం" అని ప్రభుత్వం తెలిపింది.
తుది నివేదికలో ప్రభుత్వ వాదనలు ఏమిటి?
విజయోత్సవ వేడుకలకు ముందస్తుగా ప్లాన్ చేయకపోవడం, సమన్వయం లేకపోవడం, ఆర్సీబీ, దాని భాగస్వాములు డీఎన్ఏ నెట్వర్క్స్, KSCA తగిన విధంగా పోలీస్ శాఖతో సంప్రదించకపోవడం వల్లే ఈ భయంకర ఘటన చోటు చేసుకుందని కర్ణాటక ప్రభుత్వ నివేదిక తేల్చింది.
విభిన్న కోణాల్లో విచారణ కొనసాగుతుండగా, ఈ ఘటనలో బాధ్యులను ఖరారు చేయాల్సిన అవసరం స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఆర్సీబీ యాజమాన్యం ఇంకా సీఐడీ విచారణ నివేదిక కోసం వేచి ఉంది. డీఎన్ఏ నెట్వర్క్స్, KSCA ప్రతినిధులు ఇప్పటికే తమ వాంగ్మూలాలు సమర్పించినట్లు సమాచారం. అలాగే, ఆర్సీబీపై క్రిమినల్ చర్యలకు కర్నాటక సర్కార్ సిద్ధమైంది. కర్నాటక క్రికెట్ అసోసియేషన్పై కూడా కేసులు నమోదుచేసింది.