- Home
- Sports
- Cricket
- IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెషల్.. చరిత్రలోనే అతిపెద్ద సీజన్, ఇంకా ఎన్నో మార్పులు
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెషల్.. చరిత్రలోనే అతిపెద్ద సీజన్, ఇంకా ఎన్నో మార్పులు
IPL 2026: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ 2026 ఈసారి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద సీజన్గా నిలవనుంది.ఈ సీజన్లో ఇంకొన్ని మార్పులు చేయనున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద సీజన్
ఈసారి ఐపీఎల్లో మొత్తం 84 మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటివరకు 10 జట్లు ఉన్న ఫార్మాట్లో సాధారణంగా 74 మ్యాచ్లు మాత్రమే జరిగేవి. కానీ 2026 సీజన్లో షెడ్యూల్ను విస్తరించారు. ఈసారి జట్లు ఒకదానితో ఒకటి హోమ్, అవే మ్యాచ్లలో రెండుసార్లు ఎదుర్కొనేలా షెడ్యూల్ రూపొందించారు. దీంతో మ్యాచ్ల సంఖ్య పెరగనుంది. టోర్నమెంట్ మార్చి 28 నుంచి మే 31 వరకు, దాదాపు 64 రోజుల పాటు సాగుతుంది. అయితే దీర్ఘకాలిక టోర్నమెంట్ కావడంతో జట్లకు బెంచ్ స్ట్రెంగ్త్ చాలా కీలకం అవుతుంది. ఆటగాళ్ల ఫిట్నెస్, గాయాలు, ఫామ్ నిర్వహణ పెద్ద సవాలుగా మారనుంది.
మళ్లీ వస్తున్న శాటిలైట్ స్టేడియంలు
ఐపీఎల్ 2026లో మరో ముఖ్యమైన అంశం శాటిలైట్ స్టేడియంలు. అంటే ఒకే జట్టు తమ హోమ్ మ్యాచ్లను ఒకటి కంటే ఎక్కువ స్టేడియాల్లో ఆడుతుంది. కొన్ని స్టేడియాల్లో మౌలిక సదుపాయాల పనులు జరుగుతుండటం, అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం వల్ల ఈ విధానం అమలు చేస్తున్నారు. దీంతో మరిన్ని నగరాల్లో క్రికెట్ మ్యాచ్లు చూడటానికి అభిమానులకు అవకాశం ఉంటుంది.
రాజస్థాన్ రాయల్స్ – గువాహటి ఫ్యాక్టర్
ఈసారి రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్లను రెండు నగరాల్లో నిర్వహించనుంది. జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో 4 మ్యాచ్లు, గువాహటిలోని బర్సాపారా స్టేడియంలో 3 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక అసోంకు చెందిన రియాన్ పరాగ్ ఈ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం కూడా ప్రత్యేక ఆకర్షణ. గువాహటి మ్యాచ్లకు స్థానిక అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది.
ఇతర జట్ల స్టేడియం మార్పులు
గత సీజన్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి తమ హోమ్ మ్యాచ్లను రెండు నగరాల్లో ఆడనుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచ్లు, రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో 2 మ్యాచ్లు ఆడనుంది. ఇక పంజాబ్ కింగ్స్ మళ్లీ ధర్మశాలను రెండో హోమ్ లో ఉపయోగించనుంది. ఈసారి ఐపీఎల్ ఫైనల్ మే 31న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు.
కొత్త మార్పులు
ఐపీఎల్ 2026లో కొన్ని జట్లలో నాయకత్వ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ – రియాన్ పరాగ్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్ మళ్లీ కెప్టెన్. గత సీజన్లో గాయంతో ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయిన గైక్వాడ్ ఈసారి తిరిగి జట్టును నడిపించనున్నాడు. ఇక ఎంఎస్ ధోని వికెట్ కీపర్ బ్యాటర్గా జట్టులో కొనసాగనున్నాడు. అభిమానుల అనుభవాన్ని మెరుగుపరచడానికి స్మార్ట్ రీప్లే సిస్టమ్ అనే కొత్త టెక్నాలజీని అన్ని స్టేడియాల్లో అమలు చేయనున్నారు. దీని వల్ల థర్డ్ అంపైర్ నిర్ణయాలు వేగంగా వస్తాయి. అలాగే షెడ్యూల్ను రెండు దశల్లో విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

