India vs Pakistan : కొలంబో గ్రౌండ్ ఎవరికి అనుకూలం..? ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత?
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ రేపు (ఫిబ్రవరి 15న) జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ ఎంత కీలకం కానుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి? అనేది వివరంగా చూద్దాం.

ఇండియా-పాకిస్థాన్ టీ20 మ్యాచ్: పాత రికార్డులు ఏం చెబుతున్నాయి?
ICC Men's T20 World Cup 2026 : ఇప్పటివరకు ఇండియా, పాకిస్థాన్ జట్లు 16 సార్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 13 సార్లు టీమిండియానే గెలిచింది. దీన్నిబట్టి భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే భారత్, పాకిస్థాన్ మధ్య పోరులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపు 75% సార్లు ఛేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. అంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్కు గెలుపు అవకాశాలు ఎక్కువన్నమాట.
ఇండియా-పాక్ మ్యాచ్లో స్కోర్లు ఎలా ఉంటాయి?
ఇండియా, పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లలో భారీ స్కోర్లు పెద్దగా నమోదు కాలేదు. అత్యధిక ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 159 పరుగులు కాగా, అత్యల్ప స్కోరు 118. దీన్నిబట్టి రేపు కొలంబోలో జరిగేది కూడా హై-స్కోరింగ్ మ్యాచ్ కాదని, ఒత్తిడితో కూడిన గేమ్ అని అర్థమవుతోంది. ఇక్కడ 200 స్కోర్లు చాలా అరుదు. 150-160 పరుగులు చేస్తే మ్యాచ్ టైట్గా మారుతుంది.
కొలంబో మైదానంలో ఎవరికి అనుకూలం?
దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్లలోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఈ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్ సాగేకొద్దీ పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. కాబట్ట టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్లో సేఫ్ స్కోర్ ఎంత?
క్రికెట్ నిపుణుల ప్రకారం… పిచ్ నెమ్మదిగా ఉంటే 150-155 పరుగులు కూడా కాపాడుకోగల స్కోరే. మంచి ఆరంభం లభించి, చేతిలో వికెట్లు ఉంటే 165-170 పరుగులు మ్యాచ్పై పట్టు సాధించడానికి సరిపోతాయి. స్కోరు 175 దాటితే ఛేజింగ్ చేసే జట్టుపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. అంటే ఈ మ్యాచ్కు మ్యాజిక్ ఫిగర్ సుమారు 165 పరుగులు. స్కోర్ ఇంతకంటే తక్కువ ఉంటే, మ్యాచ్ ఎవరివైపైనా మొగ్గు చూపొచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే, ఛేజింగ్ జట్టుపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది.
ఇండియా-పాక్ మ్యాచ్లో స్పిన్ కీలకం
ఇరు జట్లలోనూ మంచి స్పిన్నర్లు ఉన్నారు. భారత్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉండగా, పాకిస్థాన్లో షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ ఉన్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే, సెకండ్ ఇన్నింగ్స్లో పరుగులు చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి, ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే తెలివైన నిర్ణయం కావచ్చు.
ఇండియా vs పాకిస్థాన్: టాసే మ్యాచ్ను నిర్ణయిస్తుందా?
గత రికార్డుల ప్రకారం చూస్తే ఛేజింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంది. కానీ ప్రస్తుత పిచ్ పరిస్థితుల ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉండొచ్చు. అంటే కెప్టెన్ నిర్ణయం అంత సులభం కాదు. ఏదేమైనా జట్టు 165+ స్కోర్ చేయగలిగితే, మ్యాచ్పై పూర్తి నియంత్రణ సాధించవచ్చు.

