Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?
Ajinkya Rahane: టీమిండియా స్టార్ ప్లేయర్ అజింక్య రహానే క్రికెట్కు గుడ్బై చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత రహానేకు బీసీసీఐ ప్రతి నెలా పెన్షన్ ఇవ్వనుంది. భారత క్రికెట్ పెన్షన్ రూల్స్, రహానేకు ఎంత వస్తుంది? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అంతర్జాతీయ క్రికెట్కు రహానే గుడ్బై
టీమిండియా స్టార్ ప్లేయర్, మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పారు. జూలై 30న ఆయన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2011లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన రహానే, 2023 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 38 ఏళ్ల ఈ సీనియర్ బ్యాటర్ ఇండియా తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడారు.
రహానే ఖాతాలో 85 టెస్టుల్లో 5,077 పరుగులు (12 సెంచరీలు), 90 వన్డేల్లో 2,962 పరుగులు, 20 టీ20ల్లో 375 పరుగులు ఉన్నాయి. ముఖ్యంగా 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి, ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు అద్భుతమైన సిరీస్ విజయాన్ని అందించడం ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. రిటైర్మెంట్ తర్వాత ఆయనకు బీసీసీఐ నుంచి గట్టి ఆర్థిక భరోసా లభించనుంది.
రహానేకు బీసీసీఐ నుంచి నెలనెలా ఎంత పెన్షన్ రానుంది?
రిటైర్మెంట్ తర్వాత రహానేకు బీసీసీఐ నుంచి ప్రతి నెలా రూ. 70,000 ఫిక్స్డ్ పెన్షన్ అందుతుంది. గతంలో 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన మాజీ ప్లేయర్లకు నెలకు రూ. 50,000 పెన్షన్ ఇచ్చేవారు. అయితే 2022లో బీసీసీఐ ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రహానే ఏకంగా 85 టెస్టులు ఆడటంతో ఆయన టాప్ పెన్షన్ కేటగిరీ పరిధిలోకి వచ్చారు. దాంతో ఆయనకు ఇకపై ప్రతి నెలా రూ. 70 వేల పెన్షన్ ఖాతాలో పడనుంది.
పెన్షన్ పెంపుపై సౌరవ్ గంగూలీ ఏం చెప్పారు?
2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలో రిటైర్డ్ క్రికెటర్ల పెన్షన్ను సవరించారు. ఆ సమయంలో గంగూలీ మాట్లాడూతూ.."మన మాజీ క్రికెటర్ల ఆర్థిక సంక్షేమం చూసుకోవడం చాలా ముఖ్యం. ఆటగాళ్లే ఈ ఆటకు ప్రాణవాయువు. ఆట ముగిసిన తర్వాత వారికి బోర్డుగా అండగా నిలవడం మన బాధ్యత. అంపైర్లు కూడా గుర్తింపు లేని హీరోలు, వారి సేవలను కూడా బీసీసీఐ ఎంతో విలువైనవిగా భావిస్తుంది" అని వ్యాఖ్యానించారు.
పెన్షన్ రావడానికి ఉన్న ఒకే ఒక్క కండిషన్ ఇదే
రహానేకు ఈ పెన్షన్ అందుతుంది కానీ దీనికి ఒక ముఖ్యమైన షరతు ఉంది. రహానే బీసీసీఐలో ఎలాంటి అధికారిక పదవి (కోచ్ లేదా అడ్మినిస్ట్రేటర్) తీసుకోనంత వరకు మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఆయన భవిష్యత్తులో బీసీసీఐలో కోచ్గానో లేదా బోర్డు అడ్మినిస్ట్రేటర్గానో బాధ్యతలు స్వీకరించి జీతం తీసుకుంటే, ఆ సమయంలో పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తారు.
ప్రస్తుతానికి రహానే తన ఫ్యూచర్ ప్లాన్స్ పూర్తిగా వెల్లడించలేదు కానీ, యంగ్ క్రికెటర్లకు మెంటార్గా వ్యవహరించడానికి ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ వంటి దిగ్గజాలు రహానే కెరీర్ను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు.
సీనియర్ల యుగం ముగిసింది.. టీమిండియాలో మారిన లెక్కలు
గత రెండేళ్ల వ్యవధిలో భారత టెస్టు జట్టు నుంచి అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ ఒకరి తర్వాత ఒకరు వైదొలిగారు. దీంతో ఓల్డ్ గార్డ్ నుంచి ప్రస్తుతం రవీంద్ర జడేజా మాత్రమే మిగిలారు. ఈ ఏడాది 38వ బర్త్ డే జరుపుకోనున్న జడేజా కూడా తన కెరీర్ చివరి దశలో ఉన్నారు.

