- Home
- Sports
- Cricket
- Harmanpreet Kaur: ఇలాంటి ఆటతో ఎట్ల గెలుస్తాం.. హర్మన్ప్రీత్ కౌర్ షాకింగ్ కామెంట్స్ !
Harmanpreet Kaur: ఇలాంటి ఆటతో ఎట్ల గెలుస్తాం.. హర్మన్ప్రీత్ కౌర్ షాకింగ్ కామెంట్స్ !
Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైంది. క్యాచ్లు వదిలేయడం వల్లే ఓడిపోయామని ఫీల్డర్లపై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాల పై ప్రభావం పడింది.

టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు బిగ్ షాక్
2026 మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. మాంచెస్టర్ లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సౌతాఫ్రికా మహిళల జట్టు చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు ఇదే మొదటి ఓటమి. అయితే, ఈ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మైదానంలో ఫీల్డర్ల ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డర్లు క్యాచ్లు వదిలేయడం వల్లే మ్యాచ్ చేజారిందని ఆమె ఓపెన్ గానే ఒప్పుకున్నారు.
ఫీల్డర్లపై కెప్టెన్ హర్మన్ప్రీత్ ఫైర్
ఫీల్డింగ్ లో చేసిన తప్పులే తమ ఓటమికి ప్రధాన కారణమని మ్యాచ్ ముగిసిన అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ చెప్పారు. " మ్యాచ్ మధ్యలో మాకు కొన్ని అవకాశాలు వచ్చాయి, కానీ వాటిని మేం అందుకోలేకపోయాం. శ్రీ చరణి, షెఫాలీ వర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ వారికి ఫీల్డర్ల నుంచి సరైన సపోర్టు లభించలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి అవకాశాలను అస్సలు వదులుకోకూడదు. ఈ విషయంలో మాకు అదృష్టం కలిసి రాలేదు" అని హర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు.
చేజారిన క్యాచ్లు.. మరిజానే కాప్ ఊచకోత
భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా బ్యాటర్లకు భారత ఫీల్డర్లు వరుసగా లైఫ్లు ఇచ్చారు. ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత్ ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసింది. ఆ తర్వాత డేంజర్ బ్యాటర్ మరిజానే కాప్ 25 పరుగులు, అలాగే 65 పరుగుల వద్ద ఉన్నప్పుడు సబ్స్టిట్యూట్ ఫీల్డర్ రాధా యాదవ్ రెండు కీలక క్యాచ్లను చేజార్చింది. ఈ అవకాశాలను కాప్ పూర్తిగా ఉపయోగించుకుంది. ఆమె కేవలం బౌలింగ్లోనే కాకుండా, బ్యాటింగ్లోనూ మెరిసి 81 పరుగులతో నాటౌట్గా నిలిచి సౌతాఫ్రికాను గెలిపించింది. "కాప్ మా నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ఆమె మాకు రెండు అవకాశాలు ఇచ్చింది, ఆ క్రూషియల్ మూమెంట్స్ను మేం వాడుకోలేకపోయాం" అని హర్మన్ చెప్పారు.
టీమిండియా ఇన్నింగ్స్.. హర్మన్ప్రీత్ 200వ మ్యాచ్
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. షెఫాలీ వర్మ 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, దీప్తి శర్మ 29 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన 200వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో 24 పరుగులు చేసి అవుటైంది. సౌతాఫ్రికా బౌలర్ మరిజానే కాప్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి భారత్ను కట్టడి చేసింది.
సౌతాఫ్రికా అత్యధిక విజయవంతమైన ఛేజింగ్
159 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్ శ్రీ చరణి ప్రారంభంలోనే గట్టి షాక్ ఇచ్చింది. కేవలం 25 పరుగులకే 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కష్టాల్లో నెట్టింది. కానీ ఆ తర్వాత మరిజానే కాప్, టాజ్మిన్ బ్రిట్స్ (40 పరుగులు) కలిసి మూడో వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.
చివర్లో కాప్ స్టైలిష్గా మ్యాచ్ను ముగించింది. దీంతో సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే సౌతాఫ్రికాకు ఇది అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ కావడం విశేషం. ఈ విజయంతో గ్రూప్-A లో సౌతాఫ్రికా మూడో స్థానానికి చేరుకోగా, భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
టీమిండియా తర్వాతి మ్యాచ్లు ఎప్పుడంటే?
ఈ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, రాబోయే మ్యాచ్ల్లో బలంగా పునరాగమనం చేస్తామని హర్మన్ప్రీత్ ధీమా వ్యక్తం చేశారు. "ఈ మ్యాచ్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. కొన్ని పాజిటివ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేం పాజిటివ్గా ఉంటూ, తదుపరి మ్యాచ్ల గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. రాబోయే మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు. భారత జట్టు తన తదుపరి మ్యాచ్లో జూన్ 25న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత జూన్ 28న బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడాల్సి ఉంది.

