T20 World Cup 2026: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే !
India Women vs South Africa Women: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయింది. టీమిండియా ఓటమికి దారితీసిన 5 ముఖ్య కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

చేతులారా మ్యాచ్ను పారేసుకున్న భారత్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం!
మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఏ ఉత్కంఠ పోరులో భారత మహిళల జట్టుకు గట్టి షాక్ తగిలింది. సౌతాఫ్రికా ఉమెన్స్తో జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్కు దిగిన సౌతాఫ్రికా 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ మారిజానే కాప్ (45 బంతుల్లో 81 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో భారత్ నోటి నుంచి విజయాన్ని లాగేసుకుంది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. భారత్ ఓటమికి దారితీసిన ఆ 5 ముఖ్యమైన కారణాలు గమనిస్తే..
పవర్ప్లే తర్వాత బ్యాటింగ్ తడబాటు
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన (17), షఫాలీ వర్మ (31) అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. దీంతో భారత్ పవర్ప్లే ముగిసేసరికి 59/2 స్కోరుతో బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మారింది. పిచ్ స్లోగా మారడంతో భారత బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. మిడిల్ ఓవర్లలో (7 నుంచి 15 ఓవర్లు) భారత్ కేవలం 57 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. భారీ హిట్లు కొట్టే క్రమంలో వికెట్లు పారేసుకోవడంతో స్కోరు వేగం పూర్తిగా తగ్గిపోయింది.
మారిజానే కాప్ ఇచ్చిన క్యాచ్లను వదిలేయడం
భారత్ చేసిన అతిపెద్ద తప్పు ఫీల్డింగ్లో క్యాచ్లు డ్రాప్ చేయడం. ముఖ్యంగా మ్యాచ్ విన్నర్ మారిజానే కాప్ ఇచ్చిన రెండు కీలకమైన క్యాచ్లను భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. టీమిండియా బెస్ట్ ఫీల్డర్లలో ఒకరైన రాధా యాదవ్.. లాంగ్ ఆన్ బౌండరీ వద్ద కాప్ ఇచ్చిన సులువైన క్యాచ్ను వదిలేసింది. ఆ తర్వాత షఫాలీ వర్మ బౌలింగ్లోనూ మరో క్యాచ్ మిస్ అయింది. లభించిన లైఫ్లతో కాప్ చెలరేగిపోయి మ్యాచ్ను భారత్ నుంచి దూరం చేసింది.
మిడిల్ ఓవర్లలో చేతులెత్తేసిన బౌలర్లు
ఛేజింగ్లో సౌతాఫ్రికా జట్టు పవర్ప్లే ముగిసేసరికి 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్ శ్రీ చరణి డబుల్ వికెట్ మెయిడెన్ ఓవర్ వేసి సౌతాఫ్రికాను గట్టి దెబ్బ కొట్టింది. కానీ ఆ తర్వాత బౌలర్లు ఆ ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. 7 నుంచి 15 ఓవర్ల మధ్య సౌతాఫ్రికా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఏకంగా 86 పరుగులు రాబట్టింది. టాజ్మిన్ బ్రిట్స్ (40), మారిజానే కాప్ కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను మలుపు తిప్పారు.
ఇతర బౌలర్ల నుంచి లభించని సపోర్టు
భారత బౌలింగ్లో శ్రీ చరణి 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించింది. ఓపెనర్ షఫాలీ వర్మ కూడా 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 1 వికెట్ తీసి గట్టి పోటీ ఇచ్చింది. కానీ వీరికి మిగతా బౌలర్ల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. సీనియర్ బౌలర్ దీప్తి శర్మ 4 ఓవర్లలో వికెట్ లేకుండా 44 పరుగులు సమర్పించుకుంది. అలాగే నందిని శర్మ, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి కూడా భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో సౌతాఫ్రికాపై ఒత్తిడి తగ్గింది.
హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ ప్రభావం
భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ఇది 200వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్లో ఆమె 24 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించింది. డీప్తీ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టింది. అయితే 15వ ఓవర్లో షబ్నిమ్ ఇస్మాయిల్ వేసిన బంతిని కట్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయింది. భారత్కు మంచి ప్లాట్ఫారమ్ దొరికిన సమయంలో కెప్టెన్ అవుట్ కావడం పెద్ద మైనస్ అయింది. ఒకవేళ హర్మన్ క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోరు 170 దాటేది, ఫలితం మరోలా ఉండేది.
South Africa win by 6 wickets. #TeamIndia will now shift their focus to the next game against Bangladesh!
Scorecard ▶️ https://t.co/cIrb7Ekn0x#T20WorldCup | #WomenInBlue | #SAvINDpic.twitter.com/AfxIJJgxXh— BCCI Women (@BCCIWomen) June 21, 2026

