UPI: ఇకపై ఫోన్పే ఉచితం కాదు..? పేమెంట్ చేయడానికి ఛార్జీలు..!
దేశంలో యూపీఐ పేమెంట్స్కి భారీగా ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో చాలా మంది యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే యూపీఐ వ్యవస్థలో కీలక మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యూపీఐలో కొత్త మార్పుల సూచన
దేశంలో డిజిటల్ చెల్లింపులలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న ఈ సేవలపై కొన్ని బ్యాంకులు కొత్త ఛార్జీలు వసూలు చేయడానికి ముందడుగు వేస్తున్నాయి. పేమెంట్ అగ్రిగేటర్లు (పీఏ) నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయడం మొదలవగా, భవిష్యత్తులో వ్యాపారులు, అక్కడి నుంచి వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
KNOW
ప్రస్తుతం ఉచిత సేవలు
ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తించడం లేదు. బిల్డెస్క్, రాజోర్పే, సీసీఅవెన్యూ, క్యాష్ఫ్రీ పేమెంట్స్ వంటి పేమెంట్ అగ్రిగేటర్లు వ్యాపారులకు వినియోగదారులకు మధ్య వంతెనగా పని చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి పద్ధతులను ఈ అగ్రిగేటర్లు సమన్వయం చేస్తున్నారు. ఆర్బీఐ వివరాల ప్రకారం ప్రస్తుతం 8 లైసెన్స్ పొందిన పీఏలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, మరో 30 సంస్థల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
బ్యాంకుల కొత్త ఛార్జీలు
కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే పేమెంట్ అగ్రిగేటర్లపై 6-9 బేసిస్ పాయింట్ల వరకు రుసుములు విధించడం ప్రారంభించాయి. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానంలో ముందున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా 2-10 బేసిస్ పాయింట్ల మధ్య రుసుములు విధించేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ ఈ నెల 1వ తేదీ నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు అమలు చేసింది.
ఎస్క్రో ఖాతా కలిగిన పీఏలకు ఒక్క లావాదేవీపై 2 బేసిస్ పాయింట్లు (రూ.100 లావాదేవీకి రూ.0.02), గరిష్ఠంగా రూ.6 వరకు వసూలు చేస్తోంది.
ఎస్క్రో ఖాతా లేని పీఏలకు 4 బేసిస్ పాయింట్లు (రూ.100 లావాదేవీకి రూ.0.04), గరిష్ఠంగా రూ.10 వరకు ఛార్జీ ఉంది.
వ్యాపారులు ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా ద్వారా లావాదేవీలు చేస్తే మాత్రం రుసుము ఉండదు.
ఆర్బీఐ ఆలోచన ఏంటి.?
ప్రస్తుతం వినియోగదారులకు యూపీఐ సేవలు ఉచితంగానే ఉన్నా, భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందనే హామీ లేదు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా “యూపీఐ నిర్వహణకు అయ్యే ఖర్చును ఎవరో భరించాలి” అని వ్యాఖ్యానించారు. గతంలో నిర్దిష్ట మొత్తానికి మించిన లావాదేవీలపై ఎండీఆర్ విధించాలనే ప్రతిపాదన వచ్చినా, ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా దాన్ని వెనక్కి తీసుకున్నారు.
ప్రభుత్వ జోక్యం అవసరమా?
ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకులు ఇదే విధానం అనుసరిస్తే, పేమెంట్ అగ్రిగేటర్లు ఆ భారం వ్యాపారులకు, అక్కడి నుంచి వినియోగదారులకు బదిలీ చేసే అవకాశముంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మాత్రమే వినియోగదారులపై అదనపు భారాన్ని తగ్గించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, యూపీఐ వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.