విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.15 వేల స్కాలర్షిప్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
Scholarship: ఉన్నత విద్య చదవాలని ఆశపడుతున్న ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. జాతీయ స్నాతకోత్తర స్కాలర్షిప్ పథకం కింద అర్హులైన విద్యార్థులకు ప్రతి నెల రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది.

పీజీ విద్యార్థులకు ఎంత స్కాలర్షిప్ లభిస్తుంది?
ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.15,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. ఈ మొత్తం ఏడాదిలో 10 నెలల పాటు చెల్లిస్తారు. విద్యార్థులు గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకు ఈ ప్రయోజనం పొందవచ్చు. అంటే మొత్తం మీద రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుంది. దీంతో పీజీ విద్యకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
ఈ స్కాలర్షిప్కు ఎవరు అర్హులు?
ఈ పథకం ప్రయోజనం మొదటిసారి పీజీ కోర్సులో చేరిన విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థలో పూర్తి సమయ (Full-Time) పీజీ కోర్సులో ప్రవేశం పొందాలి. దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితిని కూడా తప్పనిసరిగా పాటించాలి.
కుటుంబ ఆదాయ పరిమితి ఎంత?
ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అర్హతను పరిశీలిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ నిబంధన ఉద్దేశం.
విద్యార్థులను ఎలా ఎంపిక చేస్తారు.?
జాతీయ స్నాతకోత్తర స్కాలర్షిప్ పథకంలో ఎంపిక ఆల్ ఇండియా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విద్యార్థుల విద్యార్హతలు, మార్కులు, ఇతర అర్హతల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. ఆ జాబితాలో స్థానం సంపాదించిన అభ్యర్థులకు స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. అందువల్ల మంచి విద్యా ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంపిక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?
అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 9వ తరగతి నుంచి ఇప్పటి వరకు ఉన్న మార్కుల మెమోలు, పీజీ ప్రవేశ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలు సక్రమంగా సమర్పించిన తర్వాత దరఖాస్తు పరిశీలనకు వెళ్తుంది.

