‘ఆపరేషన్ సింధూర్’ ట్రేడ్ మార్క్ మాకే కావాలి: రిజిస్ట్రేషన్ కోసం కంపెనీ మధ్య పోటీ
ఆపరేషన్ సింధూర్.. ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియా, టీవీ, న్యూస్ పేపర్ ఇలా ఎక్కడ చూసినా ఆ పేరే. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ సొంతం చేసుకోవడానికి ఇప్పుడు పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో రిలయన్స్ ముందంజలో ఉందని సమాచారం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై భారత దళాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో 'ఆపరేషన్ సింధూర్' అనే పేరు మారుమోగుతోంది. ఈ పేరును ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విశేషంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఈ పేరును తమ సొంతంగా ట్రేడ్మార్క్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిందని సమాచారం. దీంతో పాటు ముకేశ్ చేత్రమ్ అగర్వాల్, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, అలోక్ కొఠారి కూడా అప్లై చేశారని సమాచారం.
ఈ పేరును రిజిస్టర్ చేసుకోవాలనే కోణంలో తాజాగా రిలయన్స్ ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్కు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు సంబంధిత అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు రంగాల్లో విస్తృతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలతో ఈ సంస్థకు మరింత ప్రాధాన్యం దక్కనుంది. ట్రేడ్మార్క్ జాబితాలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు విభాగాల్లో ఈ పేరును రిజిస్టర్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, రిటైల్, గ్రాఫిక్స్, స్క్రీన్ కమ్యూనికేషన్, అల్గోరిథమిక్ కోడింగ్ వంటి విభాగాల్లో ఈ పేరు ఉపయోగించడానికి దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో "ఆపరేషన్ సింధూర్" అనే పేరు బాలీవుడ్ లోనూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంతో పేరు ప్రాచుర్యం పొందే అవకాశాన్ని సొంతం చేసుకోవాలనే వ్యూహంతో రిలయన్స్ ముందుకు వచ్చినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ పేరును వాణిజ్యపరంగా వినియోగించేందుకు ముందుకొచ్చినప్పటికీ, రిలయన్స్ దరఖాస్తు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే ఈ పేరు అధికారికంగా రిలయన్స్ సొంతంగా మారుతుంది.