Post Office: అసలు అలాగే ఉంటుంది, ప్రతీ నెల మీ అకౌంట్లో రూ. 5500 వడ్డీ పడుతుంది
Post Office: సురక్షిత పెట్టుబడితో ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది.

MIS స్కీమ్ అంటే ఏంటి?
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత ప్రతి నెలా వడ్డీ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు, స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఎంత పెట్టుబడి పెట్టొచ్చు?
ఈ పథకంలో కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. ఒక వ్యక్తి పేరుతో తెరిచే సింగిల్ అకౌంట్లో గరిష్ఠంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్లో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. జాయింట్ అకౌంట్లో ముగ్గురు వరకు సభ్యులుగా ఉండొచ్చు.
నెలకు రూ.5,550 ఎలా వస్తుంది?
ఒకవేళ మీరు రూ.9 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే, ప్రస్తుతం ఉన్న 7.4 శాతం వార్షిక వడ్డీ ప్రకారం ప్రతి నెలా రూ.5,550 వడ్డీగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ ఆదాయాన్ని మీ అవసరాలకు వినియోగించుకోవచ్చు లేదా అలాగే ఖాతాలో ఉంచుకోవచ్చు.
మెచ్యూరిటీ తర్వాత ఏమవుతుంది?
MIS పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ కాలం పూర్తయ్యాక మీరు పెట్టిన అసలు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందుతారు. అంటే ఐదేళ్ల పాటు ప్రతి నెలా వడ్డీ పొందడంతో పాటు, మెచ్యూరిటీ సమయంలో పూర్తి పెట్టుబడి కూడా సురక్షితంగా తిరిగి వస్తుంది. అయితే ఈ పథకంలో చేరాలంటే ముందుగా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి.

