OYO: కొత్త దుకాణం మొదలు పెట్టిన ఓయో.. ఇకపై ఆ సేవలు కూడా
ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భారత్లో మొదలైన ఈ హోటల్ చైన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా యువతను ఆకర్షిస్తూ హోటల్ సేవలను అందిస్తున్న ఓయో తాజాగా మరో రంగంలోకి అడుగు పెట్టింది.

OYO Room
ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో తాజాగా ఫుడ్ అండ్ బివరేజ్ రంగంలోకి అడుగుపెట్టింది. తమ సొంత హోటళ్లలో ఇన్హౌస్ కిచెన్లతో పాటు క్విక్ సర్వీస్ రెస్టారెంట్ కార్ట్స్ ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రకటించింది. "కిచెన్ సర్వీసెస్" అనే పేరుతో ఓయో యాప్, వెబ్సైట్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. వీటిని హోటల్ లోపల ఏర్పాటు చేసి వంటగది ద్వారానే అందిస్తారు.
oyo rooms
"టౌన్హౌస్ కేఫే" అనే పేరుతో ఓయో టౌన్హౌస్ హోటల్స్లో ప్రత్యేక QSR కియాస్కులు ఏర్పాటు చేస్తారు. మొదటిగా 2025–26 సంవత్సరంలో 1,500 హోటళ్లలో ఈ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సేవల ద్వారా అదనంగా 5–10% ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఓయో అంచనా వేస్తోంది.
పైలట్ ప్రోగ్రాం విజయవంతం:
ఈ ఆలోచనను ముందుగా ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో 100 హోటళ్లలో పైలట్ ప్రోగ్రామ్గా ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో, దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ప్రకారం, FY26లో కంపెనీకి రూ. 1,100 కోట్లు PAT లాభం రావచ్చని అంచనా వేస్తున్నారు. EBITDA (Earnings Before Interest, Taxes, Depreciation, and Amortization) లాభం రూ. 2,000 కోట్లు వరకు ఉండొచ్చని చెప్పారు.
FY25లో ఓయో ఆదాయం రూ. 2,100 కోట్లు, ఇది గత సంవత్సరం కంటే 60% పెరిగింది. G6 హాస్పిటాలిటీతో ఒప్పందం వల్ల FY25లో రూ. 275 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం. G6 లేకుండానే ఓయో ఆదాయం రూ. 1,886 కోట్లు, ఇది 42% గ్రోత్ అని వెల్లడించారు.
ఓయో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణె, ఇండోర్, కోల్కతా, జైపూర్, లక్నో వంటి ప్రధాన నగరాల్లో నిపుణులను ఏర్పాటు చేస్తోంది. తద్వారా తమ కొత్త F&B సేవల నెట్వర్క్ను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓయో తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.