Money Saving: భారతీయులు డబ్బులు ఎక్కడ దాచుకుంటున్నారో తెలుసా.? ఆశ్చర్యపోవాల్సిందే
Money Saving: సంపాదన ఎంతైనా పొదుపు మాత్రం కచ్చితంగా చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. అయితే భారతీయులు తమ సంపాదనను ఎక్కడ దాచుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా.?

పోస్టాఫీస్లపై ఆకర్షణ
2026లో భారతదేశంలో సేవింగ్స్ కోసం మళ్లీ పోస్టాఫీసులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అధిక వడ్డీ రేట్లు, ప్రభుత్వ భరోసా కారణంగా కోట్లాది మంది ఈ పథకాల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్ బ్యాంకులు డిజిటల్ సర్వీసులు, ఆకర్షణీయ ఆఫర్లతో ముందుకు వస్తున్నా… భద్రత, స్థిరమైన ఆదాయం కోసం చాలామంది పోస్టాఫీస్ స్కీమ్స్ను ఎంచుకుంటున్నారు.
ఎక్కువ వడ్డీ రేట్లు ప్రధాన ఆకర్షణ
పోస్టాఫీస్ పథకాలలో ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తోంది. ఇదే సమయంలో బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లు సాధారణంగా 7% నుంచి 7.5% మధ్యలో ఉంటాయి. ఉదాహరణకు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి సుమారు రూ.6,000 అదనంగా లాభం వస్తుంది. ఇది రిటైర్డ్ వ్యక్తులకు మంచి ఆదాయం.
భద్రతే మొదటి ప్రాధాన్యం
ఎక్కువ మంది పెట్టుబడిదారులు భద్రతను ముఖ్యంగా చూస్తున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటం వల్ల డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుందని నమ్మకం ఉంది. బ్యాంకులతో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండటం వల్ల వృద్ధులు ఎక్కువగా ఈ స్కీమ్స్ను ఎంచుకుంటున్నారు.
కుమార్తెల కోసం ప్రత్యేక పథకం
సుకన్య సమృద్ధి యోజన (SSY) కూడా ప్రస్తుతం 8.2% వడ్డీ అందిస్తోంది. ఈ పథకం 10 సంవత్సరాల లోపు బాలికల కోసం ప్రారంభించవచ్చు. 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేసి, భవిష్యత్తులో చదువు లేదా పెళ్లి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. అదనంగా, ఈ స్కీమ్పై ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80C కింద టాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
పోస్టాఫీస్ సేవలకు పెరుగుతున్న ఆదరణ
పోస్టాఫీస్ సేవలపై ప్రజల నమ్మకం పెరుగుతోంది. ముఖ్యంగా బ్యాంక్ విలీనాల తర్వాత చాలామంది పోస్టాఫీసులను సులభమైన మార్గంగా భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడు బయోమెట్రిక్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వేలిముద్రతోనే సేవలు పొందే అవకాశం ఉంది. అదే విధంగా పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి, అధిక వడ్డీ, భద్రత, ప్రభుత్వ హామీ… ఈ మూడు కారణాలతో 2026లో పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలు మళ్లీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాయి.

