Indian Railway: రైలులో మందు బాటిళ్లు తీసుకెళ్లొచ్చా.? రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి
Indian Railway: ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఆల్కహాల్ విషయంలో కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మరి రైలులో మందు తీసుకెళ్లొచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం.

రైలులో మందు తీసుకెళ్లడానికి అనుమతి ఉందా?
ఇండియన్ రైల్వే చట్టం – 1989 ప్రకారం ట్రైన్లో ఆల్కహాల్ తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధం లేదు. కానీ ఇది ఆయా రాష్ట్రాల చట్టాలపై ఆధారపడి ఉంటుంది. ఆల్కహాల్ నిషేధం లేని రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే పరిమిత మోతాదులో మందు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అయితే ట్రైన్లో ఆల్కహాల్ తాగడం పూర్తిగా నిషిద్ధం. ప్లాట్ఫామ్పై కూడా ఆల్కహాల్ సేవించకూడదు.
ఆల్కహాల్ నిషేధం ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా ఆల్కహాల్ నిషేధం అమల్లో ఉంది. గుజరాత్, బీహార్, నాగాలాండ్, లక్షద్వీప్ రాష్ట్రాలకు వెళ్లే ట్రైన్లో లేదా ఆ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆల్కహాల్ ఉంటే, అది నేరంగా పరిగణిస్తారు. ఆ రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
ట్రైన్లో ఎంత మందు తీసుకెళ్లొచ్చు?
రైల్వే నిబంధనల ప్రకారం వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే పరిమిత మోతాదులో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. ప్రధాన నిబంధనలు ఇవి:
* గరిష్ఠంగా 2 లీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
* మందు బాటిల్ పూర్తిగా సీల్ చేసి ఉండాలి.
* ఓపెన్ బాటిల్ తీసుకెళ్లడం నిషిద్ధం
* ఖాళీ బాటిళ్లు కూడా తీసుకెళ్లకూడదు
* ఈ నిబంధనలు పాటిస్తే మాత్రమే సమస్య ఉండదు.
ట్రైన్లో ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది?
ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆల్కహాల్ తాగడం చట్ట విరుద్ధం. ప్లాట్ఫామ్పైనా సేవించకూడదు. ఇలా చేస్తే.. ఇతర ప్రయాణికులకు అసౌకర్యం, భద్రతా సమస్యలు వస్తాయి. దీనికి రైల్వే పోలీసుల చర్యలు సైతం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష ఏంటి?
రైల్వే చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తారు. అవసరమైతే రెండు భరించాల్సి ఉంటుంది. ఇక ఆల్కహాల్ నిషేధం ఉన్న రాష్ట్రాల్లో పట్టుబడితే.. అరెస్టు, భారీ జరిమానా, జైలు శిక్ష, అక్కడి రాష్ట్ర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

