కేవలం కాల్స్ కోసమే ఫోన్ను ఉపయోగిస్తున్నారా? రూ. 10తో ఏడాది పాటు సిమ్ యాక్టివ్లో
కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ యూజర్లకు శుభవార్త తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) దేశంలోని 120 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు కొత్త నిబంధనలు ప్రకటించింది. వీటితో యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ సేవల్లో పారదర్శకత పెంచడానికి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఇప్పటికీ 2జీ సేవలను ఉపయోగిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సుమారు 150 మిలియన్ల మంది ఇప్పటికీ 2జీ సేవలను ఉపయోగిస్తున్నారు. అయితే వీరికి ఇంటర్నెట్ అవసరం లేకపోయినా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది.
ట్రాయ్ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు, వృద్ధులకు, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్స్ ను ఉపయోగించే వారికి ఉపయోగకరంగా ఉండనున్నాయి. ట్రాయ్ వినియోగదారుల రక్షణ నిబంధనల 12వ సవరణ కింద 2G ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్, SMS ల కోసం ఫోన్లను ఉపయోగిస్తున్న వారికి ప్రత్యేక టారిఫ్ లను ప్రకటించింది. ఇది వృద్ధులకు అనుకూలంగా ఉండనుంది.
ఈ ప్రత్యేక టారిఫ్ ఫ్లాన్ ల వ్యాలిడిటీ ఇప్పటి వరకు 90 రోజులుగా ఉండగా ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం ఈ వ్యవధి ఏడాదికి పొడగించారు. దీంతో యూజర్లకు రీఛార్జ్ భారం తగ్గుతుంది.
టాప్-అప్ వోచర్ల విషయంలో TRAI కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు కేవలం రూ. 10 వోచర్ తో యూజర్లకు తమకు అవసరమైన సేవలను పొందొచ్చు. అదే విధంగా ప్రస్తుతం పెరిగిన ఆన్లైన్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని TRAI ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్ను తొలగించాలని నిర్ణయించింది. దీంతో వినియోగదారులు రీఛార్జ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసుకోవచ్చు.
రీఛార్జ్ వోచర్లకు ముందు కలర్ కోడింగ్ విధానం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఈ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రాయ్ ఈ కొత్త మార్గదర్శకాలను డిసెంబర్ 24, 2024న ప్రకటించింది.
మొబైల్ రీఛార్జ్ ధరలు విపరీతంగా పెరుగుతోన్న ప్రస్తుతం తరుణంలో ఈ నిర్ణయం యూజర్లకు ఉపయోగకరంగా ఉండనుంది. ముఖ్యంగా డ్యూయల్ సిమ్ ఉపయోగిస్తున్న వారికి, ఫీచర్ ఫోన్లు వాడే వారు తక్కువ రీఛార్జ్ ప్లాన్ తోనే తమ సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకునే అవకాశం లభిస్తుంది.
ఇదిలా ఉంటే ట్రాయ్ ప్రకటించిన మార్గదర్శకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అయితే టెలికాం కంపెనీలు ఈ మార్పులను అమలు చేయడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. ఈ నెల చివరి నాటికి ఈ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: రాత్రుళ్లు చిన్నారుల దుస్తులు ఆరుబయట ఆరబెట్టకూడదని ఎందుకు చెప్తారు? సైన్స్ కూడా ఇదే చెబుతోంది.