మీ ఇంటికి పని మనిషి కావాలా? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చి పని చేస్తారు
మీ ఇంట్లో పనిచేయడానికి పనిమనిషి కావాలా? ఒక్క క్లిక్ లేదా ఒక్క కాల్ తో మీ ఇంటికి పని మనిషి వచ్చేస్తుంది. గంటకు ఇంత అని ఛార్జ్ చేసి పనంతా పూర్తి చేసి వెళ్లిపోతుంది. ఈ ఫెసిలిటీ ఎక్కడుందో తెలుసా?

ఈ రోజుల్లో పని మనుషులకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇంటి పనులు చేసుకొనే తీరిక లేక పని మనుషుల కోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. వారి అవసరాన్ని తీర్చేందుకు ఓ కంపెనీ ‘ఆన్ లైన్ లో పని మనుషులు’ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. ఈ సౌకర్యం ఎక్కడుంది? వారికి డబ్బులు ఎంత ఇవ్వాలి? ఎలా పనిచేస్తారు? తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
ప్రస్తుత కాలంలో నగరాల్లో ఎవరింట్లో పనులు వారు చేసుకొనే అవకాశం లేదు. ఎందుకంటే భార్య, భర్త ఇద్దరూ జాబ్స్ చేస్తే గాని ఇల్లు సాఫీగా గడవని పరిస్థితి. ఒకరి జీతంపై కుటుంబ అవసరాలు తీరాలంటే అయ్యే పనికాదు. పిల్లల స్కూల్ ఫీజులే రూ.లక్షల్లో ఉంటున్నాయి. ఇక నెలవారీ ఖర్చులు, అప్పులు, హాస్పిటల్ బిల్లులు ఇలా నెలకు కనీసం రూ.50 వేలు తెలియకుండా ఖర్చైపోతున్నాయి.
ఇంట్లో ఉండే ఆడవాళ్లయితే ఇటు ఇంటి పనులు చేసుకొని ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. పోనీ ఇంట్లో ఉండే పిల్లలు, భర్త ఏమైనా సాయం చేస్తారా అంటే.. ఎవరి బిజీ వాళ్లది. పిల్లలు చదువులతో, భర్తలు ఇంటి దగ్గర కూడా ఆఫీస్ వర్క్ చేస్తూ బిజీ బిజీగా బతికేస్తున్నారు. అందుకే ప్రతి ఇంట్లో పని మనిషి కంపల్సరీ అయిపోయింది. దీంతో పని మనుషులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
జనాల బిజీ లైఫ్ ని వ్యాపార ఐడియాగా మార్చుకుంది ఓ కంపెనీ. ఉద్యోగుల ఇళ్లలో పని మనిషి ఎంత అవసరమో గుర్తించింది. పని మనుషుల కోసం మీరు అంతలా వెతకొద్దని, ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే కేవలం 15 నిమిషాల్లో మీ ఇంటికి పంపిస్తామని ‘ఇన్స్టా మెయిడ్స్’ అనే కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉంది. ఆన్ లైన్ లో పని మనిషిని బుక్ చేసుకుంటే కేవలం 15 నిమిషాల్లో పనిమనిషిని ఇంటికి పంపిస్తారు.
ఇలా ఇంటికొచ్చి పనిచేసిందుకు గాను గంటకు రూ.200 నుంచి రూ.300 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ కంపెనీ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తుంది. ఈ కంపెనీ ద్వారా పనిచేసే పనిమనుషులు నెలకు సుమారు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ సేవలు కేవలం ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఇతర నగరాల్లోనూ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.