ఇదేం దోపిడి సామీ.. మినిమం బ్యాలెన్స్ లేదని రూ. 19 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు
Banks: బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే చిన్న చిన్న చార్జీలు పడతాయి అనుకుంటాం. కానీ ఇవే పెద్ద మొత్తంగా మారుతున్నాయి. గత 3 సంవత్సరాల్లో భారత బ్యాంకులు ఈ మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీల ద్వారా ఏకంగా రూ. 19,083 కోట్లు వసూలు చేశాయని తెలుసా.?

మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే భారీ చార్జీలు
చాలా బ్యాంకులు ఖాతాలో ఒక నిర్దిష్ట కనీస బ్యాలెన్స్ ఉంచాలని నియమం పెడతాయి. ఆ మొత్తానికి తగ్గకుండా ఉంటే ప్రతి నెలా లేదా కొన్ని సందర్భాల్లో చార్జీలు కట్ చేస్తారు. ఇలా చిన్న మొత్తాల్లో కట్ అయ్యే డబ్బు చివరకు పెద్ద మొత్తంగా మారుతుంది. ఇప్పటికే డబ్బు సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఇది మరింత భారంగా మారుతోంది.
3 ఏళ్లలో రూ. 19,000 కోట్లకు పైగా వసూళ్లు
ఈ పెనాల్టీల ద్వారా బ్యాంకులు భారీగా సంపాదిస్తున్నాయి. సమాచారం ప్రకారం, గత మూడు సంవత్సరాల్లో మొత్తం రూ. 19,083 కోట్లు బ్యాంకులు వసూలు చేశాయి. చిన్న మొత్తాలు అనిపించినా దేశవ్యాప్తంగా కోట్లాది ఖాతాల నుంచి ఈ డబ్బు రావడం వల్ల మొత్తం భారీగా పెరిగింది. ఇది సాధారణ ఖాతాదారులపై ఎంత ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు.
ప్రైవేట్ బ్యాంకులదే ఎక్కువ వసూళ్లు
ఈ పెనాల్టీల వసూళ్లలో ప్రైవేట్ బ్యాంకులు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకులు కలిపి సుమారు రూ. 10,991 కోట్లు వసూలు చేశాయి. ఇది మొత్తం మొత్తంలో సగానికి పైగా ఉంటుంది. అంటే ప్రైవేట్ బ్యాంకులు ఈ చార్జీలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి అని చెప్పవచ్చు.
టాప్లో HDFC బ్యాంక్
వేర్వేరు బ్యాంకులలో చూసుకుంటే హెచ్డీఎఫ్సీ మొదటి స్థానంలో ఉంది. ఈ బ్యాంక్ ఒక్కటే సుమారు రూ. 3,871 కోట్లు పెనాల్టీ ద్వారా సంపాదించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి.
ఈ బ్యాంకుల్లో మాత్రం పెనాల్టీ లేదు
మరోవైపు కొన్ని ప్రభుత్వ బ్యాంకులు మాత్రం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా చార్జీలు వసూలు చేయడం లేదు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం ఈ పెనాల్టీని తీసుకోవడం లేదు. అయితే గతంలో ఈ బ్యాంకులు కూడా ఈ చార్జీల ద్వారా మంచి ఆదాయం పొందిన సందర్భాలు ఉన్నాయి. మొత్త మీద మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ చిన్న విషయం అనిపించినా, అది కాలక్రమంలో పెద్ద నష్టంగా మారుతుంది. కాబట్టి ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచడం లేదా చార్జీలు లేని బ్యాంకులను ఎంచుకోవడం మంచిది. ఇలా చేస్తే అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు.

