ATM: ఏటీమ్ యూజర్లకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో మారనున్న నిబంధనలు. ఛార్జీల మోత
బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఏటీఎమ్ కార్డు ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక ఏటీఎమ్లను ఉపయోగించే క్రమంలో పలు నిబంధనలను అమలు చేస్తుంటారు. వీటిని అధికారులు తరచూ మారుస్తుంటారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మే 1, 2025 నుంచి ఏటీఎం లావాదేవీల ఛార్జీలు పెరగనున్నాయి. ఖాతాదారులు ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి లావాదేవీకి ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రూ. 21 ఛార్జీని, ఇకపై రూ. 23గా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం మార్చి 28న విడుదలైన ఆర్బీఐ సర్క్యులర్లో వెల్లడించారు.

ఛార్జీల పెంపు ఎవరికి వర్తిస్తుంది.?
ఈ ఛార్జీల పెంపు అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆధీకృత ఏటీఎం నెట్వర్క్ ఆపరేటర్లు, కార్డు చెల్లింపు నెట్వర్కులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు వర్తిస్తుంది. సొంత బ్యాంకు ఏటీఎమ్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు ఉంటాయి.
ఇతర బ్యాంకు ఏటీఎంల విషయానికొస్తే.. మెట్రో నగరాల్లో నెలకు మూడు ఉచిత లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో ఐదు ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఈ ఉచిత లావాదేవీలలో డబ్బు తీసుకోవడం (విత్డ్రా), డిపాజిట్లు, బ్యాలెన్స్ చెక్, పిన్ మార్పు వంటి ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కూడా ఉంటాయి.
ఏటీఎం ఛార్జీలను ఎందుకు పెంచారు.?
బ్యాంకుల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఏటీఎం సేవల నిర్వహణలో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆర్బీఐ ఈ పెంపును అనుమతించింది. దీంతో ఏటీఎమ్లలో పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేసే వారు అదనంగా ఛార్జీలు చెల్లించక తప్పదు. ఆర్బీఐ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఎన్ని ఏటీఎమ్లు అందుబాటులో ఉన్నాయి.?
2025 జనవరి నాటికి దేశంలో ఆన్-సైట్ ఏటీఎంలు, క్యాష్ రీసైక్లర్ యంత్రాలు (CRM): 1,30,902, ఆఫ్-సైట్ ఏటీఎంలు, CRMలు: 85,804 ఉన్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో యూజర్లు అప్రమత్తతో ఉండాలని నిపుణులు చెబుతున్నారు.