Gold Price Hike: బ్రేకుల్లేకుండా పసిడి ధరలకు రెక్కలు..అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్ తో పైపైకి
Gold Price Hike: బంగారం కొందామని అనుకుంటున్నారా? ఒక్కరోజులోనే పసిడి ధర ఏకంగా రూ.3 వేలకు పైగా పెరిగింది.. వెండి అయితే కిలోకు రూ.10 వేలు ఎగబాకింది. ఇంత భారీగా ధరలు ఎందుకు పెరిగాయి? అమెరికా–ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలకు బంగారం ధరలకు సంబంధం ఏంటి?

భారీగా దూసుకెళ్తున్న గోల్డ్, సిల్వర్
బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పైపైకి కదులుతున్న పసిడి రేట్లు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీ జంప్ చేశాయి. ఒకేరోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ.3 వేలకు పైగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా కిలోకు ఏకంగా రూ.10 వేలు పెరిగింది.
దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,130కి చేరింది. సోమవారంతో పోలిస్తే ఏకంగా రూ.3,160 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,200గా నమోదైంది. ఈ ధరలోనూ ఒక్కరోజులో రూ.2,900 పెరుగుదల కనిపించింది.
బంగారం మాత్రమే కాదు.. వెండి కూడా భారీగా దూసుకెళ్లింది. హైదరాబాద్లో కిలో వెండి ధర నిన్న రూ.2.50 లక్షలుగా ఉండగా.. మంగళవారం నాటికి రూ.2.60 లక్షలకు చేరింది. అంటే ఒక్కరోజులోనే రూ.10 వేల పెరుగుదల నమోదైంది. చెన్నైలో కిలో వెండి రూ.2.60 లక్షలు, బెంగళూరులో రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది.
బంగారానికి డిమాండ్
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలే దేశీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆంక్షలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి. దీంతో సాధారణంగా సేఫ్ హెవెన్గా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.
జనవరిలో గరిష్ఠాలను తాకిన ధరలు
ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో పసిడి ధరలు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఆ తర్వాత కొంతకాలం ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.. ఇటీవల మళ్లీ రేట్లు వేగంగా పెరుగుతున్నాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇలా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన పెంచుతోంది. ఇక అంతర్జాతీయ పరిణామాల్లోకి వెళ్తే.. అమెరికా విధిస్తున్న ఆంక్షలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ దేశంపై ఆంక్షలు విధించడం అమెరికాకు అలవాటుగా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు.
ఇరాన్ సైన్యంలో కీలక మార్పులు
దౌత్యపరమైన మార్గాల్లో లక్ష్యాలను సాధించలేనప్పుడు అమెరికా ఆంక్షలను ఆశ్రయిస్తోందని ఆయన ఆరోపించారు. అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోతే మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ఇరాన్ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్.. ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ నెట్వర్క్లను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇరాన్కు చెందిన అక్రమ ఆర్థిక వ్యవస్థలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తామని హెచ్చరించారు.
ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య ఆంక్షలు, ఉద్రిక్తతలు కొనసాగుతుంటే.. మరోవైపు ఇరాన్ సైన్యంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొంటున్న ఈ అనిశ్చిత పరిస్థితులు మార్కెట్లపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఒక్కరోజులోనే పసిడి రూ.3 వేలకు పైగా, వెండి రూ.10 వేలు పెరగడంతో.. రాబోయే రోజుల్లో ధరల కదలిక ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

