- Home
- Business
- April 1 Rule Changes: రైల్వే టికెట్ నుండి ఏటీఎం వరకు.. ఏప్రిల్ 1 నుండి ఏం మారబోతున్నాయి?
April 1 Rule Changes: రైల్వే టికెట్ నుండి ఏటీఎం వరకు.. ఏప్రిల్ 1 నుండి ఏం మారబోతున్నాయి?
April 1 Rule Changes : ఏప్రిల్ 1 నుండి ఆర్థికంగా చాలా మార్పులు రాబోతున్నాయి. కొత్త ఆదాయపు పన్ను చట్టం, బ్యాంకింగ్, రైల్వే నిబంధనల్లో భారీ మార్పులు రానున్నాయి. మీ జేబుపై ప్రభావం చూపే ఆ 10 మార్పుల వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్.. ఆ 10 మార్పులు ఇవే
కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో దేశంలో అనేక ఆర్థిక నిబంధనలు మారుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్ల నాటి పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం రావడం చరిత్రాత్మక మార్పుగా చెప్పవచ్చు. వీటిపై అవగాహన లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి రాబోయే మార్పులు గమనిస్తే..
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలు
బ్రిటిష్ కాలం నాటి లేదా 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఇప్పుడు 'ఆదాయపు పన్ను చట్టం, 2025' అమల్లోకి వస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం పన్ను విధానాన్ని సరళీకృతం చేయడం. ఇకపై అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ వంటి పదాలకు బదులుగా కేవలం టాక్స్ ఇయర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు వచ్చే ఆదాయాన్ని టాక్స్ ఇయర్ 2026-27గా పరిగణిస్తారు. ఈ కొత్త చట్టంలో సెక్షన్ల సంఖ్యను 819 నుండి 536కి, చాప్టర్లను 47 నుండి 23కి తగ్గించారు.
రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు
మధ్యతరగతి ప్రజలకు పన్నుల విషయంలో భారీ ఉపశమనం లభించనుంది. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద పెంచిన రిబేట్ కారణంగా, ఏడాదికి రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి అదనంగా జీతం పొందే ఉద్యోగులకు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా లభిస్తుంది. దీనివల్ల పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది.
టీడీఎస్ ఫారమ్లలో మార్పులు
పన్ను పత్రాల విషయంలో ప్రభుత్వం పెద్ద మార్పులు చేసింది. ఏప్రిల్ 1 నుండి పాత ఫారమ్ 16 స్థానంలో ఫారమ్ 130 వస్తుంది. అలాగే ఫారమ్ 16A స్థానంలో ఫారమ్ 131 అమల్లోకి రానుంది. జీతం, వడ్డీ ఆదాయాన్ని మరింత పారదర్శకంగా, సులభంగా రిపోర్ట్ చేయడానికి ఈ మార్పులు ఉపయోగపడతాయి. పన్ను చెల్లింపుదారులు ఈ కొత్త ఫారమ్లను గమనించడం ముఖ్యం.
పాన్ కార్డ్, ఏటీఎం నిబంధనలు
ఇకపై పాన్ కార్డ్ దరఖాస్తు కోసం ఆధార్ కార్డును పుట్టిన తేదీ ఆధారంగా తీసుకోదు. దీని కోసం 10వ తరగతి మార్కుల జాబితా, పాస్పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ వంటి చట్టబద్ధమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు బ్యాంకింగ్ రంగంలో, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ యూపీఐ ఏటీఎం లావాదేవీలను కూడా ఫ్రీ లిమిట్లో చేర్చింది. ఉచిత పరిమితి దాటితే ప్రతి విత్ డ్రాయల్కు రూ. 23 వసూలు చేస్తారు. బంధన్ బ్యాంక్ మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను మాత్రమే అనుమతిస్తుంది. తక్కువ బ్యాలెన్స్ వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ. 25 ఛార్జీ పడుతుంది.
బంగారం, ప్రయాణం, రైల్వే నిబంధనల్లో మార్పులు
గోల్డ్ బాండ్స్ విషయంలో పన్ను మినహాయింపులు కేవలం ఆర్బీఐ ప్రైమరీ ఇష్యూ ద్వారా కొన్న వాటికే వర్తిస్తాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి కొనుగోలు చేసిన బాండ్లపై వచ్చే లాభంపై 12.5% పన్ను చెల్లించాలి. విదేశీ ప్రయాణాల విషయానికి వస్తే, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై ఎటువంటి కనీస పరిమితి లేకుండా 2% ఫ్లాట్ టీసీఎస్ వసూలు చేస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా, రైల్వే టికెట్ రీఫండ్ నిబంధనలు కఠినతరం అయ్యాయి. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తేనే రీఫండ్ వస్తుంది. గతంలో ఈ పరిమితి 4 గంటలుగా ఉండేది. అదనంగా, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఏప్రిల్ 1 నుండి ఎల్పీజీ సిలిండర్ ధరలు మారే అవకాశం ఉంది.

