- Home
- Business
- ఇక లారీల పనైపోయినట్టే: ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణించే హైడ్రోజన్ ట్రక్ వచ్చేసింది
ఇక లారీల పనైపోయినట్టే: ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణించే హైడ్రోజన్ ట్రక్ వచ్చేసింది
Hydrogen Truck: రవాణా రంగంలో లారీల అవసరం చాలా ఉంటుంది. సాధారణంగా డీజిల్ తో నడిచే లారీలు మనం చూస్తుంటాం. వీటి మెయిన్టెనెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే దేశంలోనే టాప్ కంపెనీల్లో ఒకటైన అదానీ గ్రూప్ హైడ్రోజన్ తో నడిచే ట్రక్ ను తయారు చేసింది. ఇటీవల దీన్ని అఫీషియల్ గా ఆవిష్కరించింది. ఈ ట్రక్ ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రక్ను అదానీ గ్రూప్ ఆవిష్కరించింది. మైనింగ్ రవాణా కోసం ఈ ట్రక్ను ఉపయోగించనున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. దీని ద్వారా సాంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ పై ఆధారపడటం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. ఛత్తీస్గఢ్లో ఈ ట్రక్ ను ఆవిష్కరించారు. 40 టన్నుల బరువును మోసుకెళ్లగల ఈ ట్రక్ను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఇటీవల ప్రారంభించారు. కరే పాల్మా గని నుండి విద్యుత్ కేంద్రానికి బొగ్గును తీసుకెళ్లడానికి ఈ ట్రక్ ఉపయోగిస్తామని అదానీ కంపెనీ ప్రకటించింది.
ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. ప్రయాణం..
ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న డీజిల్ ట్రక్కులకు బదులుగా క్రమంగా హైడ్రోజన్ ట్రక్కులను ఉపయోగిస్తామని అదానీ కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో వీటి సంఖ్యను పెంచుతామని తెలిపింది. ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగినది ఈ ట్రక్ లో మూడు హైడ్రోజన్ ట్యాంకులు అమర్చారు. ఇది డీజిల్ ట్రక్కులకు సమానమైన బరువును మోసుకెళ్లగలదు.
పర్యావరణానికి హాని చేయని వెహికల్స్
ఈ హైడ్రోజన్ ట్రక్, కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని అదానీ గ్రూప్ తెలిపింది. కార్బన్ డయాక్సైడ్, ఇతర కాలుష్య కారక వాయువులను విడుదల చేసే డీజిల్ ట్రక్కుల మాదిరిగా కాకుండా, హైడ్రోజన్ ట్రక్కులు నీటి ఆవిరి, వేడి గాలిని మాత్రమే విడుదల చేస్తాయి. దీని ద్వారా పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.
ఇది ఎలా పనిచేస్తుందంటే..
హైడ్రోజన్ ఇంధన కణాలు, విద్యుత్ రసాయన ప్రక్రియ ద్వారా పనిచేస్తాయి. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్తుగా మారుతుంది. ఇందులో నీరు, వేడి మాత్రమే బయటకు విడుదలవుతాయి.
హైడ్రోజన్ ఇంధన కణంలోకి వెళ్ళినప్పుడు అది ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లుగా విడిపోతుంది. ప్రోటాన్లు ఒక పొర ద్వారా వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్లు ఒక సర్క్యూట్ ద్వారా వెళ్లి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తు వాహనం మోటారుకు శక్తినిస్తుంది. ఈ ప్రక్రియలో వాహనం నుండి నీరు మాత్రమే విడుదలవుతుంది.
టాటా కంపెనీ ట్రక్కులు కూడా వచ్చేస్తున్నాయి..
టాటా కంపెనీ కూడా హైడ్రోజన్ ట్రక్కులు తయారు చేస్తోంది. కొన్ని నెలల క్రితం వీటిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ ట్రక్కులు హైడ్రోజన్ తో పనిచేసేవి కావడంతో పర్యావరణానికి ఎలాంటి హానీ చేయవు. అందుకే ప్రభుత్వం కూడా ఇలాంటి వాహనాల తయారీని ఎంకరేజ్ చేస్తోంది. అదానీ కంపెనీ కూడా మరిన్ని ట్రక్కుల తయారీకి సన్నద్ధమవుతోంది.