Thalliki Vandanam: ఏపీలో తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు.. అమల్లోకి కొత్త పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన 'సూపర్ సిక్స్' హామీల అమల్లో మరో ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు “తల్లికి వందనం” పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నారు.

మరో పథకానికి గ్రీన్ సిగ్నల్
సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,745 కోట్లు జమ చేయనున్నారు. ఈమేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ జీవో విడుదల చేయనుంది.
లక్ష్యం ఏంటి?
పేదరికం కారణంగా పిల్లలు విద్యను మధ్యలో ఆపకూడదన్నదే తల్లికి వందనం పథకం ఉద్దేశం. విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం. అందుకే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 తల్లి ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు.
అర్హులు ఎవరు.?
ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తిస్తుంది. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. కనీసం 75% హాజరు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు అయి ఉండాలి. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల పిల్లలకు ఈ పథకం వర్తించదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు లేదు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. స్కూల్ ఆధారంగా ప్రభుత్వం డేటా సేకరిస్తుంది. అర్హత కలిగిన తల్లుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తారు.
అవసరమైన పత్రాలు:
తల్లి, విద్యార్థి ఆధార్ కార్డు
తల్లి బ్యాంక్ ఖాతా వివరాలు
హాజరు వివరాలు
ఆదాయ ధ్రువీకరణ పత్రం
పాఠశాల ధృవీకరణ
అడ్రస్ ప్రూఫ్
పాస్పోర్ట్ సైజు ఫోటోలు
NPCI లింకింగ్ తప్పనిసరి
తల్లి ఖాతాను ఆధార్తో NPCI ద్వారా లింక్ చేయాలి. ఈ ప్రక్రియను బ్యాంక్, మీ సేవా కేంద్రం లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పూర్తిచేయవచ్చు. దరఖాస్తు చేసినవారి ఆధారాలను, హాజరు శాతం, కుటుంబ ఆర్థిక స్థితిని పరిశీలించి అర్హతలు నిర్ధారిస్తారు. అర్హులైన తల్లుల ఖాతాల్లోనే నిధులు నేరుగా జమ చేస్తారు.