Pawan kalyan: సర్కారు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు
Ration distribution: ఇకపై నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు పూటలుగా రేషన్ డీలర్ల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ఉంటుందని ఆంధప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నెలలో 15 రోజులు, రెండూ పూటలుగా రేషన్ సరుకుల పంపిణీ
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సరుకుల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసువచ్చింది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందించనున్నారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేయనుంది.
రోజుకు రెండు పూటలు ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయనుంది. ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత వివరాలు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బందులు
గత ప్రభుత్వ హయాంలో రేషన్ సరుకులను ఇంటింటికి ఇవ్వడంపై తీసుకున్న నిర్ణయం కార్యాచరణలో పూర్తిగా విఫలమైందని కూటమి ప్రభుత్వం పేర్కొంది. రూ.1600 కోట్ల వ్యయంతో వాహనాలను కొనుగోలు చేసినా, అవి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్ల వద్ద నిలిపి పంపిణీ చేయడం వల్ల లక్షలాది పేదలకు రేషన్ సరుకులు అందకుండా పోయాయని పవన్ కళ్యాణ్ కార్యాలయం పేర్కొంది.
వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు తమ రోజువారీ ఉపాధిని మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు ఈ విధానంలో అవకతవకలు వెల్లడి కావడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిందని తెలిపింది.
రేషన్ బియ్యం అక్రమ రవాణా
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. దీనికి అధిక ప్రాధాన్యతనిస్తూ, కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో వేలాది టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకుంది. ఈ రేషన్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు, ప్రతి పేద కుటుంబానికి సరుకులు సమయానికి అందించేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చినట్టు పవన్ తెలిపారు.
కొత్త రేషన్ విధానంతో ప్రజలకు మరింత సౌలభ్యం
ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు రేషన్ డీలర్ల దుకాణాలే పంపిణీ కేంద్రాలుగా మళ్లీ వ్యవస్థీకరించారు. రద్దీని తగ్గించేందుకు రోజుకు రెండు పూటలుగా పంపిణీ ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేసింది.
వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి నేరుగా రేషన్ సరుకులు
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ప్రత్యేక సదుపాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఈ చర్య ప్రజలకు మేలు చేస్తుందని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.
కొత్తగా తీసుకున్న చర్యలు ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడంలో సహాయపడుతుందనీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో పారదర్శకతను తీసుకువస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ చర్యలు మంత్రి నాదెండ్ల నేతృత్వంలో జనరంజకంగా అమలవుతుందని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.