చంద్రబాబు మే 30న సీఐఐ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం, 31న కోనసీమ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 30న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఈ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ కి బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు హోటల్ తాజ్ ప్యాలెస్ వేదికగా జరిగే సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు, అదే రాత్రి ఢిల్లీలో బసచేసి మే 31న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

ఈ పర్యటనలో చంద్రబాబు, కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశముందని సమాచారం. జూన్ 21న విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో, ఆయన్ను స్వాగతించేేందుకు చంద్రబాబు కేంద్ర నేతలను కలిసే అవకాశముంది.

ఇదే నెల 31న చంద్రబాబు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పింఛన్ పంపిణీ కార్యక్రమంతోపాటు బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాక, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

కాట్రేనికోన మండలంలోని చెయ్యేరులో ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో 'పీ4' పేరుతో ఓ కొత్త అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించనున్నారు. అదే గ్రామంలోని సభా వేదిక దగ్గర, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.9.8 లక్షలతో చెరువు పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కూడా ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరిశీలిస్తారు.

చంద్రబాబు ఓఎన్జీసీ స్థలంలో ఉన్న గన్నేపల్లి హెలిపాడ్‌లో హెలికాప్టర్ ద్వారా దిగనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో చెయ్యేరుకు చేరుకుంటారు. పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు సూచనలు అందించారు.ఇక పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశముంది. ఈ వారం మొత్తం ఆయన రాజకీయంగా బిజీగా గడిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు, అక్కడి నుంచి కుప్పం వెళ్లి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వెంటనే కడప వెళ్లి మూడు రోజుల పాటు మహానాడు సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి ముమ్మడివరం పర్యటనకు సిద్ధమవుతున్నారు.