ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు
IMD weather alert: ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాల కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మళ్లీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్ర తూర్పు తీరప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, వడగండ్ల వానలు, గాలివానలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలకు భారీ వర్ష సూచన
ఉత్తర గుజరాత్, నైరుతి రాజస్థాన్ మీద ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి ఏర్పడింది. ఈ వ్యవస్థ 3.1 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావం బంగాళాఖాతంలోనూ కనిపిస్తోంది. దాంతో ఆదివారం, సోమవారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీర ప్రాంతాల్లో (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు)లో ఆదివారం మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. రానున్న రోజుల్లో కూడా వర్ష ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన, 30–40 కి.మీ. వేగంతో గాలులు ప్రభావం కనిపించింది. సోమవారం, మంగళవారం కూడా ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.
దక్షిణ ఆంధ్ర, రాయలసీమలో కూడా వర్షాలు
ఆంధ్ర దక్షిణ తీర ప్రాంతాల్లో కూడా సోమవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
తెలంగాణలోని వరంగల్-హన్మకొండ-కాజీపేటల్లో ఆదివారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. వరదనీరు రోడ్లపైకి వచ్చి రవాణాకు అంతరాయం కలిగించింది. శివనగర్ అండర్బ్రిడ్జ్ వద్ద వర్షపు నీటిలో ఒక టీఎస్ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. దాంతో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఒక గంటపాటు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సురక్షితంగా వారిని బయటకు తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు కురిసినా, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 5.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్లో 3.1 మి.మీ., భద్రాద్రి కొత్తగూడెంలో 1.7 మి.మీ. వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సహా 20 జిల్లాల్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది.
తెలంగాణ రాష్ట్ర విపత్తు అంచనా కేంద్రం (TGDPS) ప్రకారం, సెప్టెంబర్ 9 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.