- Home
- Andhra Pradesh
- వచ్చే 24 గంటలు అత్యంత జాగ్రత్త.. ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. ఆకస్మిక వరదలు
వచ్చే 24 గంటలు అత్యంత జాగ్రత్త.. ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. ఆకస్మిక వరదలు
Flash Flood: ఆంధ్రప్రదేశ్ను మరో తుపాను భయపెడుతోంది. ఇప్పటికే శ్రీలంకలో భారీ నష్టానికి కారణమైన దిత్వా విపత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను
నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంకకు సమీపంలోని సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను వేగంగా ఉత్తర–వాయువ్య దిశలో కదులుతోంది. ప్రస్తుతం ట్రికోమలికి వాయువ్య దిశగా సుమారు 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ–ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
దక్షిణ ఏపీలో ఆకస్మిక వరదలు
తుపాను ప్రభావంతో రాబోయే 24 గంటల్లో దక్షిణ ఆంధ్రలోని నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదల సూచనలు జారీ చేశారు. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం తర్వాత తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆదివారం నాటికి
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, తుపాను అదే దిశలో కదులుతూ ఆదివారం ఉదయం తమిళనాడు ఉత్తర తీరాలు, పుదుచ్చేరి పరిసరాలు, అలాగే దక్షిణ ఆంధ్ర తీరానికి చేరుకుంటుందని తెలిపింది. శనివారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
తీవ్ర వాయుగుండంగా
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ‘దిత్వా’ ప్రస్తుతం కారైకాల్కు 220 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో ఉంది. గడిచిన ఆరు గంటల్లో సుమారు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను, ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మత్స్యకారులు, ప్రజలకు కీలక సూచనలు
వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉండడంతో, మంగళవారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సందర్భాల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.

