మొంథా తుపాను అలర్ట్: కల్లోలంగా తీర ప్రాంతాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Cyclone Montha : మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, గాలుల తీవ్రత ఉన్న ప్రాంతాల్లో రెస్క్యూ, పునరుద్ధరణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

తుపాను పరిస్థితిపై ఆర్టీజీఎస్ నుంచి చంద్రబాబు, పవన్ సమీక్ష
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావంతో ఆకస్మిక వరదలు, వాగులు పొంగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుపాను ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గతంలో వచ్చిన తుపాన్ల నష్టాన్ని పరిశీలించి, అదే విధమైన తీవ్రమైన పరిణామాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం తెలిపారు.
తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడలో అప్రమత్తం
ప్రస్తుతం మొంథా తుపాను కోస్తా ఆంధ్ర తీరానికి అత్యంత సమీపంగా ఉందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరం దాటే అవకాశముందని అధికారులు నివేదించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ ప్రాంతాల్లో ఇప్పటికే గాలులు, వర్ష తీవ్రత ఎక్కువగా ఉందని వారు వివరించారు.
దీనిపై స్పందించిన సీఎం, తుపాను తీరం దాటే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరిన్ని రెస్క్యూ బృందాలను, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు. అత్యవసర యంత్రసామాగ్రి, సమాచార వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు
రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం సేకరించి విశ్లేషించాలని ఆయన సూచించారు.
గతంలో హుద్ హుద్ తుపాను సమయంలో తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదవడంతో ఎర్రకాలువ పరిసర ప్రాంతాల్లో అప్రమత్తం అవసరమని తెలిపారు.
నీట మునిగిన వేల హెక్టార్ల పంటలు.. డ్రోన్లతో నష్టం గుర్తింపు
గడచిన 24 గంటల్లో విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లోని 1.92 కోట్ల మందికి వర్షాలపై హెచ్చరిక సందేశాలు పంపించామన్నారు.
2,703 జనరేటర్లు, 81 వైర్లెస్ కమ్యూనికేషన్ టవర్లు, యాప్ ద్వారా పర్యవేక్షణలో ఉన్న యంత్ర పరికరాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాలు, చెట్లు, టవర్లు, హోర్డింగ్లు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
వర్షాలతో 43 వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు తెలిపారు. కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో పంట నష్టాలు నమోదయ్యాయని చెప్పారు. రైతులు నష్టం వివరాలు యాప్ ద్వారా పంపేలా మార్పులు చేయాలని సీఎం సూచించారు.
ప్రజల రాకపోకలకు అంతరాయం రాకుండా చర్యలు
తుపాను కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై పడితే రాకపోకలకు ఇబ్బంది కలగవచ్చు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ ఫీల్డులో ఉన్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
రాయలసీమలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా నది ఎగువ ప్రవాహాల నీటితో చెరువులు నింపే ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఒక్క టీఎంసీ నీరు కూడా వృథా కాకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు అనిత, నారాయణ, అనగాని సత్యప్రసాద్, సీఎస్ కె. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర అధికారులు హాజరయ్యారు.