- Home
- Andhra Pradesh
- స్లీపర్ బస్సులను నిషేధించాల్సిందే.. కర్నూల్ ప్రమాదంపై IOCL మాజీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
స్లీపర్ బస్సులను నిషేధించాల్సిందే.. కర్నూల్ ప్రమాదంపై IOCL మాజీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Bus Accident: 19 మంది మరణించిన కర్నూలు బస్సు ప్రమాద సంఘటనపై తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ చైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య లింక్డిన్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ డిజైన్నే మృతి వలయం
భారతదేశంలో స్లీపర్ బస్సుల్లో జరిగే అగ్ని ప్రమాదాలు ఎన్నో కుటుంబాల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రతి సారి విచారణలు, సానుభూతులు, పరిహారాలు కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంది. నేను దశాబ్దాలుగా ప్రమాదకరమైన ఆయిల్ రంగంలో పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. భద్రత అంటే కేవలం జాగ్రత్తలు కాదు, అది క్రమశిక్షణ, కఠిన నియంత్రణ, రాజీ లేని నిబద్ధత.
తాజా ఘటనలు భయంకర వాస్తవం చెబుతున్నాయి
అక్టోబర్ నెలలోనే రెండు ఘటనల్లో 41 మంది మృతి చెందారు. కర్నూలులో 19 మంది, రాజస్థాన్ గ్రామీణ ప్రాంతంలో 20 మంది. గత దశాబ్దంలోనే 130 మందికి పైగా స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదాల్లో మరణించారు. వీరిలో చాలా మంది నిద్రలోనే మంటల్లో చిక్కుకున్నారు, బయటకు రావడానికి 20–30 సెకన్ల సమయం కూడా దొరకలేదు. ఇది ప్రమాదం కాదు, ఇది ఇంజనీరింగ్ వైఫల్యం.
ప్రాణాలు బలి తీసుకునే డిజైన్
స్లీపర్ బస్సుల సమస్య కేవలం డ్రైవర్ తప్పిదం కాదు, డిజైన్ కూడా. ఈ బస్సులో బెడ్స్ చాలా తక్కువ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. బస్సు మధ్యలో నడవడానికి కూడా వీలు లేకుండా చాలా సన్నని మార్గం ఉంటుంది. అత్యవసర ద్వారాలు మూసివేసి ఉంటాయి లేదా ప్రయాణికులకు కనిపించవు. అలాగే బస్సులో ఉపయోగించిన ప్లాస్టిక్ ఇంటీరియర్ మంటల్లో వేగంగా దహనమవుతుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవడం లేదా అందుబాటులో లేకపోవడం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తాయి. అధికంగా ప్రయాణికులను ఎక్కించడం వల్ల కదిలే స్థలం కూడా ఉండదు.
శ్రీకాంత్ ఎం వైద్య లింక్డిన్ పోస్ట్
ఇతర దేశాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి
ప్రపంచంలోని ఇతర దేశాలు ఈ ప్రమాదాన్ని గుర్తించి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి.
* చైనా: 2012లో స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది.
* వియత్నాం: బస్సు డిజైన్, సేఫ్టీ కోడ్లు, ఎమర్జెన్సీ ద్వారాలు ఇలా అన్నింటినీ కొత్తగా రూపొందించింది.
* జర్మనీ: స్లీపర్ బస్సులను పరిమిత, నియంత్రిత విధానంలో మాత్రమే అనుమతిస్తోంది.
కానీ భారత్ మాత్రం ఇంకా ప్రమాదం జరిగాక విచారణలతో సరిపెట్టుకుంటోంది.
వ్యవస్థ వైఫల్యం
దేశంలో దాదాపు 16 లక్షల బస్సులు నడుస్తున్నాయి. వాటిలో 78% ప్రైవేట్ ఆపరేటర్లు ఐదు బస్సుల కంటే తక్కువనే నిర్వహిస్తున్నారు. ఇంత విస్తృతమైన చిన్నచిన్న యాజమాన్యాలపై సరైన పర్యవేక్షణ జరగడం అసాధ్యం. ప్రభుత్వ RTC బస్సులు తగ్గడంతో ఆ ఖాళీని అనధికారిక స్లీపర్ బస్సులు, మార్చిన వాహనాలు, తప్పు వైరింగ్ పూరిస్తున్నాయి. లాభం, వేగం, అదనపు సీట్లు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి.. అన్నింటికంటే ముఖ్యమైన భద్రతను మాత్రం గాలికి వదిలేశారు.
పూర్తిగా నిషేధించాల్సిందే..
ఇలాంటి తప్పు డిజైన్ను “సవరించడం” అసాధ్యం. మంటలు పట్టే డిజైన్ను నియంత్రించలేము, తొలగించడమే ఏకైక మార్గం. చైనా, వియత్నాం వంటి దేశాలు చెయ్యగలిగితే, భారత్ ఎందుకు చేయలేదు. రాత్రి ప్రయాణం అనేది గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆశతో ఉండాలి, ప్రాణాలతో బయటపడాలనే భయంతో కాదు.