Andhra pradesh: సోషల్ మీడియా బంద్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Andhra pradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వచ్చే 90 రోజుల్లో దశలవారీగా అమలు చేసేలా చర్యలు చేపడతామన్నారు.

చిన్నారులకు సోషల్ మీడియాపై నిషేధం
ప్రస్తుతం ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రతిపాదనల ప్రకారం 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలనే యోచన ఉంది. అయితే ఈ పరిమితిని 16 సంవత్సరాల వరకు పెంచాలా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. నిపుణులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల అభిప్రాయాలు సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.
90 రోజుల్లో విధివిధానాల ఖరారు
ఈ నిర్ణయం అమలు కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సీఎం తెలిపారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి విధివిధానాలను రూపొందించి అమలు ప్రారంభిస్తాం అని చెప్పారు. సోషల్ మీడియా కంపెనీలతో చర్చలు జరిపి వయస్సు ధృవీకరణ విధానాలను మరింత కఠినంగా చేయించే ప్రయత్నం కూడా ఉండనుంది.
యువతపై డిజిటల్ ప్రభావం ఆందోళన
పిల్లలు చిన్న వయసులోనే సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అధిక స్క్రీన్ టైమ్ వల్ల చదువు, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నాయని నిపుణులు సూచిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ మోసాలు, అనుచిత కంటెంట్, వల్గర్ వీడియోలు వంటి అంశాలు కూడా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఐటీ మంత్రి నారా లోకేష్ సూచనలతో నిర్ణయం
ఈ అంశాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుగానే ప్రస్తావించారు. దావోస్ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. ఇతర దేశాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి రాష్ట్రానికి అనుకూలంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చ
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ అవసరం అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. మొబైల్ ఫోన్ వ్యసనం, ఆన్లైన్ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

