- Home
- Andhra Pradesh
- TTD: తిరుమలలో బర్త్డే కేక్ కట్ చేయకూడదా.? ఇలాంటి నిబంధనలు ఇంకేం ఉన్నాయి.?
TTD: తిరుమలలో బర్త్డే కేక్ కట్ చేయకూడదా.? ఇలాంటి నిబంధనలు ఇంకేం ఉన్నాయి.?
TTD: ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆలయ పవిత్రతను కాపాడే క్రమంలో టీటీడీ పలు కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. కాగా తాజాగా ఓ వివాదం చర్చనీయాంశంగా మారింది.

తిరుమలలో కేక్ కట్ వివాదం
ఇటీవల తిరుమలలో జరిగిన ఒక ఘటన చర్చనీయాంశమైంది. బిగ్బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో వచ్చిన దివ్వెల మాధురి తిరుమలలో కేక్ కట్ చేయించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఈ బృందం శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని శ్రీవిభవ అతిథిగృహంలో దిగారు. అక్కడే కేక్ కట్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుమలలో కేక్ తీసుకురావడం, కట్ చేయడం టి.టి.డి. నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ వ్యవహారం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పరిశీలన చేపట్టినట్లు సమాచారం. గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్, మాధురి శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ చేసిన ఘటనపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో టీటీడీ అమలు చేస్తున్న నియమనిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల యాత్రకు ముందు భక్తులు తెలుసుకోవాల్సిన విషయాలు
తిరుమల యాత్రకు బయలుదేరే ముందు కొన్ని సంప్రదాయాలు పాటించడం చాలా మంది భక్తులు ఆచరిస్తుంటారు. ముందుగా తమ ఇష్టదైవం లేదా కులదైవానికి ప్రార్థనలు చేసి యాత్ర ప్రారంభించడం సాధారణంగా కనిపించే ఆచారం. అలాగే తిరుమలలో దర్శనం, వసతి కోసం ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం మంచిది. ముందస్తుగా ప్రణాళిక ఉంటే యాత్ర సాఫీగా సాగుతుంది. తిరుమలకు చేరుకున్న తరువాత సంప్రదాయం ప్రకారం ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, వరాహ స్వామిని దర్శించడం చేస్తారు. ఆ తరువాత శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేయడం సంప్రదాయం.
ఆలయంలోకి వెళ్లే ముందు పాటించాల్సిన ఆచారాలు
తిరుమల ఆలయం అత్యంత పవిత్రమైన స్థలం. అందువల్ల ఆలయంలోకి వెళ్లే ముందు భక్తులు పరిశుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించడం అవసరం. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ప్రశాంతంగా ఉండి స్వామివారి ధ్యానం చేయాలని అధికారులు సూచిస్తారు. దర్శనం కోసం క్యూలో నిలబడి శాంతంగా ఉండాలి. ఈ సమయంలో “ఓం నమో వెంకటేశాయ” అనే నామస్మరణ చేయడం చాలా మంది భక్తులు పాటించే ఆధ్యాత్మిక విధానం. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ వంటి తీర్థాల్లో స్నానం చేయడం కూడా పవిత్రంగా భావిస్తారు.
భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు
తిరుమలలో చాలా పురాతన సంప్రదాయాలు ఉన్నాయి. అందుకే అక్కడి ఆచారాలను గౌరవించడం ప్రతి భక్తుడి బాధ్యత. స్వామివారికి సమర్పించే నగదు లేదా కానుకలను హుండీలో మాత్రమే వేయాలి. ఆలయంలో ఎలాంటి తొందరపాటు చేయకుండా క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలి. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి. పురుషులు: ధోవతి-ఉత్తరీయం, కుర్తా-పైజామా. మహిళలు: చీర-రవిక, లంగా-ఓణి, చుడీదార్ లేదా పంజాబీ డ్రస్ ధరించాలి. ఈ డ్రెస్ కోడ్ను టి.టి.డి. కచ్చితంగా అమలు చేస్తోంది.
తిరుమలలో చేయకూడని పనులు
తిరుమలలో కొన్ని పనులు పూర్తిగా నిషేధం. ఆలయ పవిత్రతను కాపాడటానికి ఈ నియమాలు అమలు చేస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల్లో చెప్పులు ధరించరాదు. ఎక్కువ నగదు లేదా విలువైన ఆభరణాలు తీసుకురావడం మంచిది కాదు. ధూమపానం, ఆల్కహాల్, మాంసాహారం పూర్తిగా నిషేధం. పేకాట, జూదం వంటి కార్యకలాపాలు అనుమతించరు. ఆలయంలో ఉమ్మివేయడం, అల్లరి చేయడం తప్పు. భిక్షగాళ్లను ప్రోత్సహించకూడదు. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లరాదు. దళారుల ద్వారా దర్శనం లేదా వసతి ఏర్పాటు చేయించుకోవద్దు. నకిలీ ప్రసాదాలను కొనకూడదు. అన్యమత ప్రచారం, రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా నిషేధం. ఆయుధాలు తీసుకురావడం కూడా నిషేధం. ఎవరైనా లైసెన్సు ఆయుధాలు తీసుకువస్తే అలిపిరి చెక్పోస్ట్ వద్ద అధికారులకు తెలియజేయాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
రీల్స్ పేరుతో పిచ్చి వేషాలు
ఇటీవల కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ రీల్స్ పేరుతో కొండపై పిచ్చి వేషాలు వేస్తున్నారు. మాడ వీధుల్లో, ఆలయ ప్రాంగణంలో డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. దీనిపై టీటీడీ తీవ్రంగా స్పందిస్తోంది. తోటి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తూ, ఆలయ పవిత్రను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని టీటీడీ ఇప్పటికే పలుసార్లు హెచ్చరించింది.

