టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం రోజు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ చేయనున్నట్లు ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లకు.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ వ్యవహారం వివాదంగా మారింది. ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించడంతో నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నారు.
ఎగ్జిబిటర్లతో నిర్మాతల సమావేశం
బుధవారం సాయంత్రం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశం అయ్యారు. సమస్య పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టాలీవుడ్ నుంచి దిల్ రాజు, సురేష్ బాబు, డివివి దానయ్య, నాగ వంశీ, సాహు గారపాటి లాంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు.
మల్టీప్లెక్స్ తరహా లోనే సింగిల్ థియేటర్స్ కి కూడా వసూళ్లలో పర్సంటేజీ ఇవ్వాలనేది ఎగ్జిబిటర్ల డిమాండ్. దీనికి నిర్మాతలు, బయ్యర్లు సుముఖంగా లేరు. కొందరు నిర్మాతలు మాత్రం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఎగ్జిబిటర్లకు అద్దెప్రాతిపదికనే సినిమాలను ఇస్తామని చెబుతున్నారు. అద్దె ప్రాతిపదిక ద్వారా తమకి ఆదాయం ఉండడం లేదని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు.
పర్సెంటేజి డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్లు
మల్టీప్లెక్స్ లలో మాత్రం పర్సంటేజీలు తీసుకుంటుంటే తాము మాత్రం ఎందుకు అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించాలని కొందరు థియేటర్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు జూన్ 1న థియేటర్ల బంద్ తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ మీటింగ్ లో సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మే 23న మరోసారి నిర్మాతలు.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.
ఏది ఏమైనా థియేటర్ల బంద్ వ్యవహారం మాత్రం టాలీవుడ్ లో ఉత్కంఠ గా మారింది. జూన్ నెలలో హరిహర వీరమల్లు, థగ్ లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి భారీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఒకవేళ థియేటర్ల బంద్ జరిగితే ఈ చిత్రాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది.