విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా157 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.
విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా157 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా నయనతార నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన వినూత్నమైన, వినోదాత్మక వీడియో ద్వారా వెల్లడించారు. చిరంజీవి చిత్రంలో నయనతార నటిస్తుందనే అనౌన్స్ మెంట్ ని అనిల్ రావిపూడి అద్భుతంగా ప్లాన్ చేశారు. ప్రత్యేకంగా షూట్ చేసిన వీడియో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో నయనతార తన సిబ్బందితో తెలుగులో సంభాషించడం, కార్ రైడ్లో చిరంజీవి హిట్ పాటలు వింటూ సౌండ్ పెంచమని చెప్పడం, స్క్రిప్ట్ చదవడం, చిరు డైలాగ్ను రీక్రియేట్ చేయడం వంటి సన్నివేశాలు చూపించారు. చివర్లో అనిల్ రావిపూడి తానే స్క్రీన్లోకి వచ్చి నయనతార మెగా157లో హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించారు.
ఇది చిరంజీవి, నయనతార జోడిగా తెరపై కనిపించనున్న మూడవ సినిమా. గతంలో వీరిద్దరూ సైరా నరసింహారెడ్డి (2019), గాడ్ఫాదర్ (2022) చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. మెగా157లో నయనతార పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోందని, ఈ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా రూపొందించామంటూ దర్శకుడు హింట్ ఇచ్చారు.
ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ప్రమోషన్ చివర్లో చిరంజీవి ప్రసిద్ధ డైలాగ్ను ఉపయోగించి విడుదల తేదీ గురించి మరోసారి ధృవీకరించారు. నయనతార వీడియో చివర్లో కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అని చెప్పడం, ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని చెప్పడం తెగ ఆకట్టుకుంటోంది. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. నయనతార, చిరంజీవి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందా అన్నది ఆసక్తికర అంశం. చిరంజీవి కూడా నయనతారకి స్వాగతం పలికారు. హ్యాట్రిక్ చిత్రానికి వెల్కమ్.. సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని నయన్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు.