ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ లెక్కలు తెలుసుకుందాం. ఎన్ని కోట్లు వస్తే సేఫ్‌ అనేది తెలుసుకుందాం. 

దర్శకుడు శేఖర్‌ కమ్ముల రూపొందించిన `కుబేర`(Kuberaa) మూవీ శుక్రవారం విడుదలైంది. ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా వంటి భారీ స్టార్‌ కాస్టింగ్‌తో ఈ మూవీ రూపొందింది. నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌, శేఖర్‌ కమ్ముల సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

 బిచ్చగాడికి, కుబేరుడికి మధ్య సాగే పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇది మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. అంతా ధనుష్‌ నటన గురించి మాట్లాడుకుంటున్నారు. బిచ్చగాడిగా ఆయన ఒదిగిపోయారు. పాత్రలో జీవించారు.

 ఇలాంటి పాత్రలో నటించడం మామూలు విషయం కాదు, ఆ విషయంలో ధనుష్‌ సాహసం చేశారు. సినిమాలో ఆయన పాత్ర హైలైట్‌గా నిలిచిందంటున్నారు. అలాగే నాగార్జున పాత్రకి, రష్మిక పాత్రలకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

`కుబేర`పై నెగటివ్‌ టాక్‌కి కారణాలివే

కానీ సినిమా విషయంలో ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కథ పరంగా బలమైనదే అయినా, దాన్ని అంత బలంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడనే టాక్‌ వినిపిస్తోంది. సినిమా సాగదీయడం పెద్ద మైనస్‌ గా అంటున్నారు. 

పైగా మూవీ ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఒకే ఫ్లోలో సాగుతుంది, ఎలాంటి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు లేవని అంటున్నారు. ఎమోషన్స్ లో సీరియస్‌ నెస్‌ లేదనే, భావోద్వేగాలు వర్కౌట్‌ కాలేదని అంటున్నారు. మరోవైపు చెప్పాలనుకున్న విషయాన్ని తిప్పి తిప్పి చెప్పినట్టుగా ఉందంటున్నారు.

 దీనికితోడు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఏమాత్రం వర్కౌట్‌ కాలేదు. సినిమాకి మరో పెద్ద మైనస్‌ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్‌ అనే చెప్పాలి. ఒక్క పాట మినహా మిగిలిన పాటలు ఆకట్టుకునేలా లేవు. 

అదే సమయంలో బిజీఎం విషయంలోనూ డిజప్పాయింట్‌ చేశారు డీఎస్పీ. అసలు ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించాడా? అనే సందేహాలు కలిగేలా ఆయన వర్క్ ఉండటం గమనార్హం.

`కుబేర` స్టార్‌ కాస్టింగ్‌ ఓపెనింగ్స్ తెస్తుందా?

`కుబేర` క్లైమాక్స్ లో విషయం ఉన్నా, దాన్ని సింపుల్‌గా ముగించిన తీరు కూడా ఆడియెన్స్ ని డిజప్పాయింట్‌ చేస్తుందని, వాహ్‌ ఫ్యాక్టర్స్ లేకపోవడం సినిమాకి మెయిన్‌ మైనస్‌గా చెబుతున్నారు. చాలా సన్నివేశాలు లాజికల్‌ గా కన్‌ క్లూజన్‌ లేదు. సరైన క్లారిటీ లేదనే విమర్శలు వస్తున్నాయి. 

ఇవన్నీ మైనస్‌గా ఆడియెన్స్ నుంచి వినిపిస్తుంది. అయితే ఆర్టిస్ట్ ల నటన, టెక్నీకల్‌గా బాగుండటం సినిమాకి ప్లస్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు కథలో విషయం లేకపోతే, ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేకపోతే, వాళ్లు ఎంటర్‌టైన్‌ అయ్యేలా లేకపోతే ఎంత పెద్ద స్టార్‌ కాస్టింగ్‌ ఉన్నా వృధా ప్రయాస అనే చెప్పాలి. 

ఇటీవల చాలా సినిమాల ఫలితాలు అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. `కుబేర` విషయంలోనూ ఏం జరుగుతుందా అనేది మున్ముందు తేలనుంది. కాకపోతే భారీ స్టార్‌ కాస్ట్ కావడంతో ఓపెనింగ్స్ బాగానే ఉండే ఛాన్స్ ఉంది. మొదటి రోజుకి తిరుగులేదు, ఆ తర్వాత ఏమేరకు నిలబడుతుందో చూడాలి.

`కుబేర` మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌

ఇదిలా ఉంటే ఈ మూవీకి బిజినెస్‌కి సంబంధించిన లెక్కలు ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి. సినిమాని భారీ రేట్‌కే అమ్మేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.58.9కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యిందని తెలుస్తుంది. 

అంటే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు రూ.120కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. ఇక ఏరియా వైజ్‌గా థియేట్రికల్‌ బిజినెస్‌ చూస్తే నైజాంలో రూ.12కోట్లు, సీడెడ్‌లో నాలుగు కోట్లు, ఉత్తరాంధ్ర నాలుగు కోట్లు, ఈస్ట్‌ గోదావరి రూ.2.2 కోట్లు, వెస్ట్ గోదావరి రెండు కోట్లు, కృష్ణా రూ.2.05కోట్లు, నెల్లూరు రూ.1.2 కోట్ల బిజినెస్‌ అయ్యిందట. 

ఇలా ఏపీ, తెలంగాణలో 30 కోట్ల బిజినెస్‌ అయ్యిందని, తమిళనాడులో రూ.15కోట్లు, కన్నడ, మలయాళం, నార్త్ కలిసి ఆరు కోట్లు అని, ఓవర్సీస్‌లో రూ.8కోట్ల బిజినెస్‌ జరిగిందని సమాచారం. ఈ మూవీకి వ్యాపారం బాగానే జరిగింది. 

మరి కలెక్షన్ల పరంగా ఏమేరకు సత్తా చాటుతుందో మున్ముందు చూడాలి. ఇక ఈ చిత్రం ఓటీటీ మాధ్యమం అమెజాన్‌ ప్రైమ్‌లో రాబోతుంది. ఈ డీల్‌ కూడా బాగానే జరిగిందని సమాచారం. నెల రోజుల్లో ఈ చిత్రం ఓటీటీలో రానుంది.

`కుబేర` కథేంటనేది చూస్తే

బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సార్ప్ కుబేరుడిగా నటించారు. ఆయన కన్ను బంగాళాఖాతంలోని ఆయిల్‌ నిధిపై పడుతుంది. అందుకోసం కేంద్ర మంత్రులతో డీల్‌ కుదుర్చుకుంటారు. ఆ కంపెనీ ప్రైవేట్‌ చేసేలా, దాన్ని తమ కంపెనీకి అమ్మేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. అందుకోసం వారికి లక్ష కోట్లు లంచం ఇవ్వాల్సి ఉంటుంది. 

ఇందులో యాభై వేల కోట్లు బ్లాక్‌లో, యాభై వేల కోట్లు వైట్‌లో ఇవ్వాల్సింది. ఈ మనీ లావాదేవీలకు బినామీలను సృష్టించాలి. హవాలా కంపెనీలను ఓపెన్‌ చేసి వాటి ద్వారా డబ్బుని విదేశాలకు పంపించి, అట్నుంచి ఇండియాకి తీసుకురావాలనేది ప్లాన్‌. ఇది పెద్ద స్కామ్‌. 

ఈ స్కామ్‌ చేయడానికి సరైన వ్యక్తి కావాలని జైల్లో ఉన్న సీబీఐ అధికారి నాగార్జునని రంగంలోకి దించుతారు. ఆయన చట్టం చేత, నాయకులచేత మోసపోయిన వాడు. దీంతో జిమ్‌ సార్ప్ ఇచ్చిన డీల్‌కి ఓకే చెబుతాడు. ఈ స్కామ్‌ చేసేందుకు ఓకే చెబుతాడు. 

బినామీలు చదువుకున్న వాళ్లైతే సమస్య వస్తుందని, బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. అలా ఎంచుకున్న ఒక బిచ్చగాడే ధనుష్‌. మనీ లావాదేవీలు జరిగే క్రమంలో ఒక పొరపాటు జరుగుతుంది. ధనుష్‌ పేరుతో జరగాల్సిన ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ అవుతుంది.

 అతను వారి నుంచి పారిపోతాడు. మరి అతన్ని పట్టుకోవడం కోసం పడే నాగార్జునతోపాటు బిజినెస్‌ మ్యాన్‌ మనుషులు సెర్చ్ చేస్తారు. ధనుష్‌ దొరికాడా?ఈ స్కామ్‌ సాఫీగా సాగిందా? ధనుష్‌ ఇచ్చిన ట్విస్టేంటి? అనేది మిగిలిన కథ.