ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన 'కుబేరా' సినిమా టీజర్ విడుదలై అంచనాలు పెంచింది. డబ్బు, అధికారం, గొడవల నేపథ్యంలో ధనుష్ మాఫియా డాన్ గా కనిపించనున్నారు. నాగార్జున రోల్ కొత్తగా ఉంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటిస్తున్న 'కుబేరా' సినిమా టీజర్ ఆదివారం విడుదలై అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. టీజర్ చూస్తే సినిమాలో ఇంట్రెస్ట్ డ్రామా ఉండబోతుందని అర్థమవుతోంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో ధనుష్ తో పాటు నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్బ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'ట్రాన్స్ ఆఫ్ కుబేరా' పేరుతో విడుదలైన రెండు నిమిషాల టీజర్ డబ్బు ప్రాధాన్యత, దాని ప్రభావం గురించి ఒక పాటతో మొదలవుతుంది. ధనవంతులైన జిమ్ సర్బ్, నాగార్జున పాత్రలు మొదట కనిపిస్తాయి. ఆ తర్వాత ముంబై ధారావిలో పేదవాడిగా ధనుష్ పాత్రను పరిచయం చేశారు. రష్మిక పాత్ర కూడా టీజర్ లో కనిపిస్తుంది.
టీజర్ లో ప్రధాన పాత్రల మధ్య గొడవలు, అధికార పోరాటం కనిపిస్తున్నాయి. పేదవాడిగా ఉన్న ధనుష్ బలమైన మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడో సినిమాలో చూపించనున్నారు. నాగార్జునది సంక్లిష్టమైన పాత్ర. ఆయనలో ఏదో బాధ వెంటాడుతుంది. తనలో ఒక సంఘర్షణ కనిపిస్తుంది. నాగ్ రోల్ చాలా కొత్తగా ఉంది.
ఇక రష్మిక మధ్యతరగతి అమ్మాయిగా కనిపిస్తుంది. జిమ్ సర్బ్ ధనవంతుడైన వ్యాపారవేత్తగా కనిపిస్తున్నారు. అతన్ని ఎదుర్కోవడమే ధనుష్, నాగార్జున పనిగా ఉండబోతుందని తెలుస్తుంది. అదే సమయంలో చివర్లో నాగార్జునని కొట్టేందుకు ధనుష్ రావడం మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.
`లవ్ స్టోరీ`లకు పేరున్న శేఖర్ కమ్ముల ఈసారి థ్రిల్లర్ సినిమా తీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధనుష్, నాగార్జున, రష్మిక, జిమ్ సర్బ్ నటన, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం టీజర్ కి హైలైట్. 'కుబేరా' జూన్ 20, 2025న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.