థియేటర్ల బంద్‌ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించారు. ఆ నలుగురులో తాను లేనని వివరణ ఇచ్చారు. 

థియేటర్ల బంద్‌ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` మూవీ జూన్‌ 12న విడుదల కానున్న నేపథ్యంలో జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌కి ఎగ్జిబిటర్లు పిలుపునివ్వడం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది. దీనిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ సీరియస్‌ అయ్యారు. విచారణకు ఆదేశించారు. అనంతరం పవన్‌ కళ్యాణ్ ఆఫీస్‌ నుంచి ఒక వార్నింగ్‌ నోట్‌ వచ్చింది.

థియేటర్ల బంద్‌పై పవన్‌ కళ్యాణ్ సీరియస్‌

తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని పవన్‌ కళ్యాణ్‌ తన నోట్‌లో వెల్లడించారు. దాన్ని గుర్తుంచుకుంటానని తెలిపారు. అదే సమయంలో తాను ఇండస్ట్రీ బాగు కోసం ప్రయత్నిస్తుంటే, చిత్ర పరిశ్రమకి ఇండస్ట్రీ హోదా ప్రకటించాలని చర్చలు జరుపుతుంటే తన సినిమా విషయంలోనే ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయడం పట్ల ఆయన సీరియస్‌ అయ్యారు. 

దీని వెనుకాల ఉన్న ఆ నలుగురు ఎవరో గుర్తించాలని, థియేటర్లు రన్‌ అయ్యే విధానం, ప్రభుత్వానికి టాక్స్ చెల్లింపులు, థియేటర్ల మెయింటనెన్స్ విషయంలోనూ ప్రభుత్వం దృష్టిసారించబోతున్నట్టు వెల్లడించారు. డైరెక్ట్ గానే ఇండస్ట్రీ పెద్దలకు, థియేటర్ ఓనర్లకి హెచ్చరికలు జారీ చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ కామెంట్లపై అల్లు అరవింద్‌ వివరణ

ఈ క్రమంలో తాజాగా దీనిపై నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించారు. తనపై వస్తున్న విమర్శలకు ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఆ నలుగురు చేతిలో ఉన్నాయని, ఆ నలుగురులో తాను ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందులో తాను లేను అని తెలిపారు అల్లు అరవింద్‌. తన వంద 15 లోపు థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.

ఒకప్పుడు లీజుకి తీసుకుని నడిపించానని, కానీ కరోనా తర్వాత అన్నీ వదులుకున్నట్టు తెలిపారు అరవింద్‌. లీజ్‌ అయిపోయిన వాటిని వదిలేసుకున్నానని, ఇప్పుడు ఆ నలుగురులో తాను లేను అని స్పష్టం చేశారు. ఆ నలుగురు అనే దాంట్లో తనని కలిపి విమర్శలు చేస్తున్నారని, దయజేసి అందులోనుంచి తనని పక్కన పెట్టాలని ఆయన కోరారు.

ఆ నలుగురులో నేను లేను, నా వద్ద 15లోపే థియేటర్లున్నాయి

తన వృతి సినిమా నిర్మాణం అని, గత యాభై ఏళ్లుగా అది చేస్తున్నానని, మధ్యలో అవకాశం రావడం వల్ల థియేటర్ల లీజులోకి వెళ్లానని, కానీ నాకు సరిపడదు అని తెలిశాక థియేటర్లని వదులుకున్నట్టు తెలిపారు అల్లు అరవింద్‌. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే, అందులో తనకు ఇప్పుడు కేవలం 15లోపే ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో ఒకే ఒక్క థియేటర్‌ `ఏఏఏ` ఉందని చెప్పారు.

థియేటర్ల బంద్‌పై ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రి స్పందించిన తీరు సమంజసమే అని చెప్పారు అరవింద్‌. ఈ థియేటర్ల సమస్యకు సంబంధించి జరిగిన మీటింగ్‌లకు తాను వెళ్లలేదని, ఇప్పటికీ మూడు సార్లు మీటింగ్‌ జరిగాయని, తాను ఒక్కసారి కూడా వెళ్లలేదని, అంతేకాదు తన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్లనిగానీ, తన సహ నిర్మాతలను గానీ ఆ మీటింగ్‌లకు వెళ్లొద్దని చెప్పినట్టు తెలిపారు.

సింగిల్‌ థియేటర్లకి కష్టాలున్న మాట నిజమే

`సింగిల్‌ థియేటర్లకి నిజంగానే కష్టాలున్నాయి. అలాంటప్పుడు ఛాంబర్లో చర్చించాలి. లేదంటే ప్రొడ్యూసర్‌ గిల్డ్ లో చర్చించాలి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోతే ప్రభుత్వం వద్దకు వెళ్లాలి. అక్కడ కూడా సాల్వ్‌ కాకపోతే, ఇక మరే దారి లేదనుకునే సమయంలో థియేటర్లు మూసేస్తున్నామని చెప్పాలి. 

అలా కాకుండా జూన్‌ 1 నుంచి థియేటర్లు మూసేస్తున్నామని ఏకపక్షంగా తీసుకునే నిర్ణయానికి నేను వెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడలేను. అందుకే ఆ మీటింగ్‌లకు రాను అని తెలిపినట్టు` చెప్పారు అల్లు అరవింద్‌.

పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఉండగా థియేటర్ల బంద్‌ దుస్సాహసం

`పవన్‌ కళ్యాణ్‌ సినిమా రిలీజ్‌కి ఉండగా థియేటర్లు మూసేస్తామని చెప్పడం దుస్సాహసం. అలా చేయకూడదు. మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి, మన ఇండస్ట్రీలో ఎవరికి ఏది కావాలన్నా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆయన సినిమానే ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం` అన్నారు అరవింద్‌.

`ఆ రోజు అశ్వనీదత్‌ సినిమా కోసం మేం కొద్ది మంది వెళ్లి పవన్‌ కళ్యాణ్‌ని కలిశాం ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడిని ఫిల్మ్ ఛాంబర్‌ ద్వారా వచ్చి కలవండి అని చెప్పారు. కానీ ఆ తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం వచ్చాక కలవడం కామన్‌, కానీ అది జరగలేదు.

నిన్న ఒకరు `మాది ప్రైవేట్‌ వ్యాపారం, ప్రభుత్వంతో సంబంధం లేదు` అనే అర్థంలో మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే రెండేళ్ల క్రితం ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి గత ప్రభుత్వాన్ని ఎందుకు కలిశారు. కష్టం వచ్చిందనే ఆ సీఎంని కలిశారు. కష్టం వస్తేగానీ వెళ్లి కలవమా? ఇలా చేయడం తప్పు. ప్రభుత్వంతో అన్ని రకాల అవసరాలుంటాయి. ప్రభుత్వాన్ని కాదని ఏదీ చేయలేరు` అని తెలిపారు అల్లు అరవింద్‌.

పవన్‌ కళ్యాణ్‌ బాధలో నిజముంది

`పవన్‌ కళ్యాణ్‌ బాధపడింది వంద శాతం నిజం. ఆయన సినిమా వస్తుంటే మేం థియేటర్లు మూసేస్తామంటే ఆయన్ని బెదిరిస్తున్నారా ఏంటి?` అంటూ వెల్లడించారు అరవింద్‌. మొత్తంగా ఆ నలుగురులో తాను లేనని, అందులో తనని కలపొద్దని, తనకు ఈ థియేటర్ల బంద్‌ కి ఏ సంబంధం లేదని అరవింద్‌ చెప్పే ప్రయత్నం చేశారు.