వెర్రి వెయ్యి విధాలు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. స్టార్ హీరోల అభిమానులను చూసినప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది. . తమ అభిమానాన్ని చాటుకోవడం కోసం వారు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా మహేష్ బాబు అభిమాని కూడా ఇలాంటి పనే చేశాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా మళ్లీ రీరిలీజ్ కావడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. తమ అభిమాన హీరో పాత సినిమాలను తిరిగి పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో రీరిలీజ్ ట్రెండ్ బాగా వర్కౌట్ అవుతోంది. ఈక్రమంలోనే ఖలేజా సినిమా కూడా అదే కోవలో రీరిలీజ్ అయింది.
అయితే ఈ రీరిలీజ్ సందర్భంగా విజయవాడ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఒక అభిమాని చేసిన ఓ పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే, ఖలేజా చిత్రంలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఈ సీన్ ను ఆడియన్స్ ఏమాత్రం మర్చిపోలేరు. ఫ్యాన్స్ కు ఈ సీన్ ఎంతో ఇష్టం. ఆ సీన్లో మహేష్ బాబు పాముతో నడుచుకుంటూ వచ్చే సన్నివేశం ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ సీన్కు ఫిదా అయిన ఓ అభిమాని, అదే తరహాలో థియేటర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. నిజమైన పాము పిల్లను తీసుకుని థియేటర్లోకి అడుగుపెట్టాడు. అయితే ఆ పామును చూసి ముందుగా రబ్బర్ పాము అని భావించిన ప్రేక్షకులు సరదాగా నవ్వుకున్నారు. కాని అది నిజమైన పాము అని తెలిసిన వెంటనే భయంతో పరుగులు తీశారు.
దాంతో థియేటర్లో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్ యాజమాన్యానికి విషయం తెలిసిన వెంటనే ఆ అభిమానిని బయటకు పంపించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాని ఈ ఘటనతో థియేటర్లోని ప్రేక్షకులు కాసేపు షాక్కు గురయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అయింది.