`కన్నప్ప` సినిమాకి సంబంధించిన కీలకమైన హార్డ్ డ్రైవ్‌లు మాయమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మరో షాకిచ్చే విషయం బయటకు వచ్చింది.

మంచు విష్ణు, మోహన్‌ బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` సినిమాకి పెద్ద సమస్య వచ్చింది.  ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డ్రైవ్‌లు మాయమయ్యాయి. `కన్నప్ప` మూవీలోని కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్, ముఖ్యమైన డేటా ఉన్న హార్డ్ డ్రైవ్‌ లు మిస్‌ కావడం ఇప్పుడు మూవీ టీమ్‌ని కలవరానికి గురి చేస్తుంది.

మిస్‌ అయిన `కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌లో ప్రభాస్‌ సీన్లు

`కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌ మిస్సింగ్‌ కేసులో భాగంగా మరో షాకిచ్చే వార్త బయటకు వచ్చింది. ప్రభాస్‌ నటించిన కీలక సీన్లు ఇందులోనే ఉన్నాయని, అదే ఇప్పుడు మాయమైనట్టు తెలుస్తుంది. ప్రభాస్‌పై వచ్చే కీలకమైన సీన్లు, యాక్షన్‌ సీన్లు ఈ హార్డ్ డ్రైవ్‌లోనే ఉన్నాయట. ఇవి మాయం కావడం `కన్నప్ప` టీమ్‌తోపాటు ప్రభాస్‌ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

`కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌ చోరీ వెనుక ఆ ఇద్దరు

 `కన్నప్ప` మూవీ జూన్‌ 27న విడుదల కానుంది. రిలీజ్‌కి ఇంకా నెల రోజులే ఉంది. ఈ తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరిని షాక్‌కి గురి చేస్తుంది. అయితే ఇద్దరు వ్యక్తులు ఈ హార్డ్ డ్రైవ్‌లను దొంగిలించినట్టు తెలుస్తుంది.

 పోలీసుల కథనం ప్రకారం ముంబాయిలోని హెచ్‌ఐవీఈ స్టూడియోస్‌ నుంచి `కన్నప్ప` సినిమాకు సంబంధించిన ముఖ్యమైన కంటెంట్‌ ఉన్న హార్డ్ డ్రైవ్‌ ను కొరియర్‌ ద్వారా ఫిల్మ్ నగర్‌లోని కార్యాలయానికి పంపారు. మే 25న ఈ పార్సిల్‌ వారి ఆఫీస్‌లో పని చేసే ఆఫీస్‌ బాయ్‌ రఘు అందుకున్నాడు. ఆయన ఎవరికి చెప్పకుండా చరిత అనే మహిళకు వాటిని అప్పగించినట్టు తెలుస్తుంది. 

అయితే వీరిద్దరు ఇప్పుడు కనిపించడం లేదట. దీంతో మంచు విష్ణు ప్రొడక్షన్‌ కంపెనీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రభాస్‌ సీన్లు ఉన్నాయనే వార్త మరింత షాకిస్తుంది.

`కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌ మిస్సింగ్‌పై మంచు విష్ణు రియాక్షన్‌

తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించారు. ఆయన సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. `జటాజూఠదారీ, నీ కోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?` అంటూ హరహర మహదేవ యాష్‌ ట్యాగ్‌ తో `కన్నప్ప` పోస్టర్‌ని పంచుకున్నారు. శివుడి కోసం తాను తపస్సు చేస్తుంటే తనకే ఇలా జరిగిందేంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అంతకు ముందు అధికారికంగా ఒక నోట్‌ని విడుదల చేశారు. ఇందులో చరిత, రఘుల దొంగతనాన్ని ప్రస్తావించారు. వారి ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తుందని, అంతేకాదు 90నిమిషాల ఫూటేజీని సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని మంచు విష్ణు టీమ్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలాంటి చౌకబారు పనులు ఇండస్ట్రీకే అవమానం

`చిత్ర పరిశ్రమలో ఇలాంటి చౌకబారు పనులు చూడటం, ఇలాంటి దొంగ వ్యూహాలను అమలు చేయడం నిరాశపరుస్తుంది. ఇది తప్పుడు పని మాత్రమే కాదు, విధ్వంసం, వ్యక్తిగత ప్రతీకార చర్యగా అనిపిస్తుంది. తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న సమయంలో ఇలాంటి దిగజారుడు పనులు తిరోగమనాన్ని సూచించడమే కాదు, ఇండస్ట్రీకే పెద్ద అవమానం.

 `కన్నప్ప` సినిమాని ఒక ల్యాండ్‌ మార్క్ మూవీగా నిలబెట్టడానికి మా టీమ్‌ ఎంతగానే శ్రమిస్తుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇలా అంతా ఐక్యంగా ఉన్నాం. ఇలాంటి పిరికి చర్యలకు భయపడేది లేదు. న్యాయం జరుగుతుంది, నిజం గెలుస్తుందని నమ్ముతున్నాం` అని మంచు విష్ణు టీమ్‌ తెలిపింది. పైరసీ కంటెంట్‌ బయటకు వస్తే దాన్ని ఎంకరేజ్‌ చేయోద్దని, ప్రచారం చేయోద్దని ఈ సందర్భంగా ఆడియెన్స్ కి, మీడియాకి విజ్ణప్తి చేశారు.

జ్యోతిర్లింగాల సందర్శనలో మంచు విష్ణు, మోహన్‌బాబు

మరోవైపు మంచు విష్ణు దేశంలోని జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తండ్రి మోహన్‌బాబు, `కన్నప్ప` టీమ్‌తో కలిసి శ్రీ బాబా బైద్యనాథ్‌ జ్యోతిర్లింగాని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంచు విష్ణు. 

ఇక ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, మంచు విష్ణు, మోహన్‌బాబు, శరత్‌ బాబు, కాజల్‌ వంటి భారీ తారాగణం నటిస్తున్న `కన్పప్ప` మూవీని మోహన్‌బాబు, మంచు విష్ణు కలిసి నిర్మిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ కారణంగా డిలే అయిన ఈ మూవీ జూన్‌ 27న రిలీజ్‌ కానుంది.